
జనం న్యూస్ 27 మార్చి వికారాబాద్ జిల్లా ప్రతినిధి
వికారాబాద్ ఫిబ్రవరి నెలలో బుగ్గరామేశ్వరం ఆలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఫారెస్ట్ ప్రాంతంలోని డీప్ మలుపుల వద్ద వాహనాల వేగ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వికారాబాద్ సీఐ రఘుకుమార్ తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు రోడ్డు మధ్యలో బొల్లార్డ్స్ ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని తగ్గించే చర్యలు అమలు చేస్తున్నామని చెప్పారు. మలుపుల వద్ద ఓవర్టేక్ చేయడం ప్రమాదకరమని, ఎదుటి వాహనం కనిపించకముందే ఓవర్టేక్ చేయకూడదని సూచించారు. అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంటూ, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా మాత్రమే ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సీఐ రఘుకుమార్ కోరారు.