
జనంన్యూస్.నిజామాబాద్, మార్చి 30.శ్రీనివాస్ పటేల్.
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీఓ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ప్రారంభించారు. వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు వీలుగా తాగునీటితో పాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవ చూపడం అభినందనీయమని టీఎన్జీఓ సంఘాన్ని అభినందించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీఓ ప్రతినిధులు కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం అని అన్నారు. కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయానికి వచ్చే వారికి ప్రస్తుత వేసవిలో అంబలి కేంద్రం ఉపశమనాన్ని అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు.
