
జనంన్యూస్. 10.నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్.
ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ నెల 11న నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి పర్యటనకు హాజరు కానున్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులతో కలిసి ఆయన పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కందకుర్తిలో కొనసాగుతున్న తుది ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్, అధికారులకు సూచనలు చేశారు. మోహన్ భగవత్ పర్యటనలో భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బహిరంగ సభకు వచ్చే వారు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎంపిక చేసిన స్థలంలో ఏర్పాట్లు, సభా ప్రాంగణం, బారికేడ్లు తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. ఆర్ ఎస్ ఎస్ చీఫ్ భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. సభా స్థలి వద్ద అన్ని వసతులతో కూడిన అంబులెన్స్, అగ్నిమాపక శకటం, వైద్య బృందం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రవణ్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
