
జనం న్యూస్ ఏప్రిల్ 21 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్సకు లోనైన నేపథ్యంలో, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూకట్పల్లి గోపాల్ నగర్లోని గోకుల్ ఫ్లాట్స్ పరిధిలో ఉన్న శ్రీ అభయ వీరాంజనేయస్వామి ఆలయంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజల్లో భాగంగా ప్రత్యేక హోమాలు, ఆకు పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనసేన పార్టీ కోఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ హాజరై, పవన్ కళ్యాణ్ గోత్రనామంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 108 టెంకాయలు కొట్టి, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్రజల కోసం నిరంతరం కృషి చేసే నాయకుడని, ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గోపాల్ నగర్ పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్ సభ్యులు, జనసేన నాయకులు, కాలనీ వాసులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజల్లో భాగమయ్యారు.
ఈ విధంగా అభిమానులు, పార్టీ శ్రేణులు కలిసి నిర్వహించిన ప్రార్థనలు పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న అభిమానాన్ని, విశ్వాసాన్ని ప్రతిబింబించాయి
