

జనం న్యూస్// మార్చ్ // 10 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం ఐపీఎస్ ఆదివారం నాడు భాద్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన బదిలీలలో భాగంగా ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన నూతన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా నియమించబడ్డారు. బాధ్యతల స్వీకరణకు కరీంనగర్ కు విచ్చేసిన గౌస్ ఆలం ఐపీఎస్, కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా ఉన్న అభిషేక్ మొహంతి ఐపీఎస్ ను పూల మొక్కను అందించి మర్యాద పూర్వకంగా కలిశారు. కమిషనరేట్ లోని నేరాలు , శాంతి భద్రతల గురించి తెలుసుకున్నారు. నూతన పోలీసు కమీషనర్ కు సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం కమిషనరేట్ లోని పోలీస్ అధికారులు నూతన పోలీసు కమీషనర్ కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్బంగా కరీంనగర్ నూతన పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ..ముఖ్యంగా నేరాల నియంత్రణ పై ప్రధాన దృష్టి సారిస్తామన్నారు. శాంతిభద్రతలు కాపాడటం, రోడ్డు భద్రత, ఉల్లంఘనల నివారణ, పట్టణ పోలీసింగ్పై దృష్టి సారించడం, పౌర-ఆధారిత పోలీసింగ్ సేవలు , ప్రజా భద్రతా సమస్యలు పరిష్కరించుట కృషి చేస్తామన్నారు. పోలీసింగ్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగిస్తామన్నారు. కమిషనరేటులోని పోలీసు అధికారుల మరియు సిబ్బంది సంక్షేమం కొరకు ఎల్లప్పుడూ పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మి నారాయణ, రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ఐపీఎస్, ప్రొబేషనరీ ఐపీఎస్ వసుంధర యాదవ్ కమిషనరేట్ లోని ఏసీపీ లు , ఇన్స్పెక్టర్లు , ఆర్ ఐ లు ఇతర అధికారులు పాల్గొన్నారు.