Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.,

జనం న్యూస్ 10 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లాలో సహేతుకరమైన కారణం లేకుండా అర్ధ రాత్రుళ్ళు బహిరంగంగా తిరిగిన వారిపై కేసులు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మార్చి 9న హెచ్చరించారు. రాత్రి సమయాల్లో గస్తీ, పెట్రోలింగు నిర్వహించే నమయాల్లో పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని, అందుకు అనుగుణంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. విజయనగరం పట్టణంలో రైల్వే స్టేషను, ఆర్టీసి కాంప్లెక్స్, మూడు లాంతర్లు, కోట జంక్షన్, బాలాజీ జంక్షన్, దాసన్నపేట
రైతు బజార్, రింగు రోడ్డు, కొత్తపేట, ఐస్ ఫ్యాక్టరీ, జమ్ము, విటి అగ్రహారం, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాం మున్సిపాల్టీల్లో కొన్ని ముఖ్య ప్రాంతాల్లోను పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. రాత్రి 11గంటల తరువాత వ్యాపారాలు, షాపులు, టిఫిన్ బండ్లు మూసివేసే విధంగా చర్యలు తీసుకొంటూ, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యాపారాలు సాగించినా, సహేతుకరమైన కారణాలు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించిన వారిపై టౌన్ న్యూసెన్సు చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడంతోపాటు, వారిని పోలీసు స్టేషనుకు తరలించి, వారి తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సిలింగు నిర్వహిస్తున్నామన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు రాత్రి గస్తీల్లోను, పెట్రోలింగు నిర్వహించడంలో మౌళికమైన మార్పులను చేపట్టారు. రాత్రి పెట్రోలింగు, గస్తీ విధులకు వెళ్ళే పోలీసు సిబ్బందికి సంబంధిత పోలీసు అధికారులు సమావేశమై, రాత్రి గస్తీలో నిర్వహించాల్సిన విధుల పట్ల వారికి దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా బీటు పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాయింటు పుస్తకాలుగల ప్రాంతాలను తప్పనిసరిగా సందర్శించే విధంగా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా, ఆయా బీటు పరిధిలో నివసించే హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల కదలికలను గమనించాలని, ఆయా వివరాలను బీటు పుస్తకంలో నమోదు చేయాలని, అనుమానస్పద వ్యక్తులను
ప్రశ్నించి, వారి వేలి ముద్రలను ఎం.ఎస్.సి.డి. పరికరంతో చెక్ చేయాలని, వారి నేర చరిత తెలిసిన తరువాతనే వారిని విడిచిపెట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. రాత్రి గస్తీ, పెట్రోలింగు నిర్వహించే పోలీసు సిబ్బంది తమ వెంట తప్పనిసరిగా టార్గెట్స్, విజిల్ట్స్, లాఠీలను తప్పనిసరిగా తమవెంట తీసుకొని వెళ్ళాలన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పెట్రోలింగు తిరిగే వాహనాలను, బీటు పర్యవేక్షణ అధికారులను నిరంతరం రాత్రుళ్ళు అప్రమత్తం చేయాలని పోలీసు కంట్రోల్ రూం సిబ్బందిని జిల్లా ఎస్పీ ఆదేశించారు. అంతేకాకుండా, అవసరమైన సమయాల్లో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు కారణాలు లేకుండా రాత్రి 11గంటల తరువాత సంచరించే వారిపై జిల్లా వ్యాప్తంగా 845 కేసులు నమోదు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.