

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 11 రిపోర్టర్ సలికినిడి నాగరాజు అసెంబ్లీలోజరుగుతున్నటువంటి సమావేశాల్లో పుట్టపర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు పల్లె సింధూర రెడ్డి వాల్మీకి,బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే ప్రతిపాదాన్ని తెరపైకి తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని ఎన్నార్టీ సెంటర్లోనిగల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జనాభా, రిజర్వేషన్ పరంగా అత్యధిక శాతం వారే ఎక్కువగా ఉన్నారని, దీనివలన రిజర్వేషన్ పరంగా ఎస్టీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. సుమారు ఏడుగురు ఎస్టి ఎమ్మెల్యేలు ఉండి ఈ విషయంపై ఖండించకపోవడం, దీనిపైన మాట్లాడకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మొదట్లోనే ఈ విషయాన్ని తుంచకపోతే మునుముందు భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ అంశాన్ని అసెంబ్లీలో ఆమోదింప చేసుకొని, పార్లమెంటుకి పంపించడంతో ఈ తీర్మానాన్ని ఆమోదింప చేయకుండా వెనక్కి పంపించడం జరిగిందన్నారు. శాసన సభ్యురాలు ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఇటువంటి అంశాల పైన మాట్లాడితే కులాల మధ్య చిచ్చులు రగిలే అవకాశాలు ఉన్నాయని, శాసనసభ్యురాలు ఇటువంటి విషయాలను తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం రిజర్వేషన్ల అంశాలను పరిగణంలోకి తీసుకోవద్దని హితవు పలికారు.