Listen to this article

డ్రగ్స్ నష్టాల పై విస్తృత ప్రచారం కల్పించాలి

మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన అదనపు కలెక్టర్

జనం న్యూస్, ఏప్రిల్ 16,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

జిల్లాలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ, చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయని అన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియ జేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలనీ వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. గోదావరిఖని ఆసుపత్రిలో 10 పడకల డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమైన వారికి ఇక్కడ చికిత్స అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు. అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. జిల్లా లోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని అదనపు కలెక్టర్ డ్రగ్ ఇన్స్ పెక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పెద్దపల్లి ఏసిపి జి. క్రిష్ణ, గోదావరిఖని ఏసిపి రమేష్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రకాష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.