

చిలిపి చెడు మండలంలో 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మండల విద్యాధికారి పి విట్టల్
జనం న్యూస్ మే 1 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో చిలిపి చెడు మండల విద్యార్థులు అద్భుత ప్రగతి కనపరచడం అభినందనీయమని మండల విద్యాధికారి పి. విఠల్ తెలిపారు. మండలం లోని ఐదు పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించటం మనకు గర్వకారణం అని అయన తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మండలంలో ప్రథమ స్థానంలో నిలిచిన ఈ. హరిణి మరియు రెండవ స్థానంలో నిలిచిన ఆర్. హారిక ని అభినందించారు. మండలంలో డెబ్భై కి పైగా విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించటం గొప్ప విషయం అని అయన తెలిపారు. తాను హెడమాస్టర్ గా చేస్తున్న సోమక్కపేట ఉన్నత పాఠశాలలో పదకొండు మంది విద్యార్థులు ఐదు వందల కు పైగా సాధించటం తనకు ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ముఖ్యంగా చిన్న తనం లోనే తండ్రిని కోల్పోయి కుటుంబ పరిస్థుతులు అనుకూలంగా లేకున్నా ఏ. అర్చన మరియు ఎమ్. శ్రావ్య మంచి మార్కులు సాధించటం వారి యొక్క మానసిక పరిణితి ని సూచిస్తుంది అని తెలిపారు. ఇట్టి ఫలితాలకి కారణమైన ఉపాధ్యాయుల కృషి ని ఆయన కొనియాడారు