Listen to this article

జనం న్యూస్ 24 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

గృహ‌నిర్మాణ ప‌థ‌కాల కింద గ‌తంలో ఇళ్ల స్థ‌లాలు, ఇళ్లు మంజూరై ఇళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తిచేయ‌ని ల‌బ్దిదారులంతా వెంట‌నే ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాల‌ని రాష్ట్ర గృహ‌నిర్మాణ సంస్థ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(ఫైనాన్స్‌) వెంక‌ట‌ర‌మ‌ణ సూచించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు చేసిన అద‌న‌పు స‌హాయాన్ని వినియోగించుకొని ఆయా ల‌బ్దిదారులంతా త‌మ‌కు కేటాయించిన ఇళ్ల నిర్మాణాల‌ను పూర్తిచేసుకోవాల‌ని, లేనిప‌క్షంలో ఆ ఇళ్ల స్థ‌లాలు వారి నుంచి స్వాధీనం చేసుకొని కొత్త‌గా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ఇళ్ల స్థ‌లాలు కేటాయించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. జిల్లాలో గృహ‌నిర్మాణాల‌ను పురోగ‌తిని ప‌రిశీలించే నిమిత్తం గృహ‌నిర్మాణ సంస్థ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శుక్ర‌వారం ప‌లు మండ‌లాల్లో ప‌ర్య‌టించారు. నెల్లిమ‌ర్ల మండ‌లం సీతారాంపేట‌, బొండ‌ప‌ల్లి మండ‌లం గొట్లాం, బొబ్బిలి మండ‌లం పారాదిలో ఇళ్ల కాల‌నీల‌ను సంద‌ర్శించి ఇళ్ల ల‌బ్దిదారుల‌తో మాట్లాడారు. ప్ర‌భుత్వం అందిస్తున్న అద‌న‌పు ఆర్ధిక స‌హాయాన్ని వినియోగించుకొని ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాల‌ని సూచించారు.అనంత‌రం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ కార్యాల‌యంలో జిల్లాలోని గృహ‌నిర్మాణ సంస్థ ఇ.ఇ.,డి.ఇ.లు, ఏ.ఇ.ల‌తో గృహ‌నిర్మాణ ప్ర‌గ‌తిపై స‌మీక్షించారు. ఇళ్ల నిర్మాణాల‌ను వేగ‌వంతం చేయాల‌ని, నిర్మాణాల‌కు యీ సీజ‌ను అనుకూలంగా వున్నందున ల‌బ్దిదారుల‌తో అధికారులు నేరుగా మాట్లాడి వారికి ఇళ్ల నిర్మాణంలో ఎదుర‌య్యే ఇబ్బందులు తొల‌గించాల‌ని సూచించారు. జిల్లాలో 11,648 ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 4,649 ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన 6,999 ఇళ్ళ నిర్మాణాన్ని జూన్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆయ‌న వెంట ప‌ర్య‌ట‌న‌లో గృహ‌నిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ జి.ముర‌ళీమోహ‌న్‌, ఇత‌ర అధికారులు వున్నారు.