Listen to this article

జనం న్యూస్, మే 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )

అచ్చం పగటిపూట మాదిరిగానే చిమ్మచీకటి ఆవహించినప్పుడు సైతం మన చుట్టూ ఉండే పరిసరాలు, వస్తువులు కనిపించేలా ఓ అద్భుతాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కాలిఫోర్నియాకు చెందిన బయోహాకర్స్ టీమ్, అలాగే సైన్స్ ఫర్ ది మాసెస్ అనే స్వతంత్ర పరిశోధకుల బృందంలోని నిపుణులు ఈ ఘనత సాధించారు. చిమ్మ చీకటిలోనూ చూడగలిగే ఐడ్రాప్స్‌ను వారు డెవలప్ చేశారు. చీకటిని ఛేదించే కంటి చుక్కలను డెవలప్ చేయడం కోసం పరిశోధకులు క్లోరిన్ అనే సమ్మేళనాన్ని ఉపయోగించారు. వాస్తవానికి ఇది లోతైన సముద్రాల్లోని చేపలలో, వాటి కంటిచూపునకు దోహదపడే ఒక రసాయనం. దీని కారణంగా అవి చీకటిలోనూ నీటిలో తిరుగుతూ అన్నీ చూడగలవు. అయితే ఈ సమ్మేళనాన్ని ఇన్సులిన్, అలాగే సెలైన్‌తో కలిసి కంటిలో వేయడం వల్ల తాత్కాలికంగా రాత్రిపూట సైతం చూపును మెరుగు పరిచే ఒక ద్రావణాన్ని పరిశోధకులు సృష్టించారు. పరిశోధనలో భాగంగా సరికొత్త ఐడ్రాప్‌ను సృష్టించిన పరిశోధకులు వాటిని రెండు చుక్కలు వేసుకున్నప్పుడు చిమ్మచీకటిలో సైతం164 అడుగుల దూరం వరకు 100% కచ్చితత్వంతో చూడగలిగినట్లు పేర్కొన్నారు. పైగా ఇరవై రోజుల వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడలేదట. అయితే ఆ డ్రాప్స్ పనితీరు సమయాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు 33% వరకే పనిచేసినట్లు తెలిపారు. అంటే రాత్రి నుంచి తెల్లవారు జాము వరకే ఈ ఐడ్రాప్ ప్రభావం ఉంటోందని గుర్తించిన పరిశోధకులు, నిరంతర పనిచేసేలా మరిన్ని పరిశోధనలపై దృష్టి సారించారు. ఇప్పటికిప్పుడైతే ఈ ఐడ్రాప్స్ వినియోగించేందుకు అందుబాటులో లేవు. కానీ భవిష్యత్తులో మరిన్ని పరిశోధనల తర్వాత వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.