

విద్యను వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదు..
విద్యా శాఖ మంత్రిని తక్షణమే నియమించాలి
కసిరెడ్డి మణికంఠరెడ్డి,( ఏ ఐ ఎస్ ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు,తెలంగాణ
జనం న్యూస్, జూన్ 4 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీకి అధికారులు ముందస్తు అడ్డుకట్ట వేయాలని, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యను వ్యాపారం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి కార్పొరేట్ విద్యా సంస్థలకు హెచ్చరించారు.. మంగళవారం రోజున సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్ లో జరిగిన ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం గాకముందే కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యా వ్యాపారానికి తెర లేపాయని, ముందస్తు అడ్మిషన్లు చేయడమే కాకుండా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లను ముందుగానే అమ్ముతున్నారని, కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు ఒక్క పాఠశాలకు పర్మిషన్ తీసుకొని అదే పర్మిషన్తో నాలుగైదు చోట్ల బ్రాంచ్లుగా ఏర్పాటు చేసి పాఠశాలలు నడిపిస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డొనేషన్ల పేరుతో ఫీజులు వసూలు చేస్తూ, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్ట రీతిలో ఫీజులను పెంచి తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయల దండుకుంటున్నారని, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని,వారి దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అలాంటి విద్యాసంస్థల గుర్తించి వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీస వసతులు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచే విధంగా విద్యాధికారులు చర్యలు ముమ్మరం చేయాలని అన్నారు..రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఖాళీగా ఉండటం వల్ల విద్యా వ్యవస్థ కుంటుపడిపోయే అవకాశమున్నందున ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు..ఖాళీగా ఉపాధ్యాయ, లెక్చరర్ల పోస్ట్ లను భర్తీ చేయాలని,ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు ఎక్కువగా కేటాయించాలన్నారు..ఇంజనీరింగ్ కాలేజీల్లో బీ కేటగిరి సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయాలని కోరారు..నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలు తమ ఆగడాలను ఆపకుంటే అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులకు సైతం వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్, జిల్లా సహాయ కార్యదర్శి వేల్పుల ప్రసన్నకుమార్, జిల్లా నాయకులు జక్కుల అనిరుద్ సిద్దుల సుమన్ లు ఉన్నారు.