

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జులై రిపోర్టర్ సలికినీడి నాగు
వామపక్షాలు, ప్రజా సంఘాల నిరసన
చిలకలూరిపేట కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాల కోసమే విద్యుత్ స్మార్ట్ మీటర్లను రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పెరిగిన విద్యుత్ చార్జీలు, స్మార్ట్ విద్యుత్ మీటర్లకు వ్యతిరేకంగా పట్టణంలోని ఎన్ ఆర్టీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బలవంతంగా స్మార్ట్ మీటర్ల భారాన్ని ప్రజలపై మోపి ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా ప్రజల్లో కలకలం చెలరేగిందని స్మార్ట్ మీటర్ల బిగింపును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్ల బిగింపు పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరిట కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సామాన్య ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపటమే పనిగా స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం, గత వైసిపి ప్రభుత్వం కేంద్రంలోని బిజెపితో కలిసి అదానీ లాభాలే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. నేడు అదే విధానాలు అమలు చేస్తూ స్మార్ట్ మీటర్లు ఇంటింటికి అమర్చి ప్రజలను దోపిడీ చేయాలని చూస్తున్నారని విమర్శించారు.ప్రజలంతా దీన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలు తగ్గించాలని స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకొవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా ఇన్చార్జి కార్యదర్శి తాళ్లూరి బాబురావు, సీపీఎం పట్టణ కార్యదర్శి పేరుబోయిన వెంకటేశ్వర్లు, నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ సుభాని, ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, నాయకులు చౌటు పల్లి నాగేశ్వరరావు, ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.