Listen to this article

జనం న్యూస్ జూలై 18 జగిత్యాల జిల్లా

బీరుపూర్ మండలంలోని తుంగూర్ గ్రామానికి చెందిన దోసారపు ప్రమీల బుచ్చన్న గౌడ్ కుమారుడు డా. దోసారపు విజయ్‌కుమార్‌ కి తెలంగాణ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ లభించింది. ఇటీవల నిర్వహించిన స్నాత్తకోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి చేతుల మీదుగా స్వీకరించారు. డా. విజయ్‌కుమార్‌ ప్రొఫెసర్ వాసం చంద్రశేఖర్‌ గారి మార్గదర్శకత్వంలో “బయోమాస్ ఆధారిత ప్లాట్‌ఫాం అణువులను విలువ కలిగిన ఉత్పత్తులుగా మార్పు చేసే ప్రక్రియకు ప్రభావవంతమైన హెటరోజీనియస్ కటాలిస్టుల రూపకల్పన” అనే అంశంపై తన పరిశోధనను విజయవంతంగా చేశారు.ప్రస్తుతం ఆయన శాతవాహన విశ్వవిద్యాలయం, రసాయన శాస్త్ర విభాగంలో సహాయ ప్రొఫెసర్‌గా 2013 నుండి కొనసాగుతున్నారు. ఆయనకు మొత్తం 13 సంవత్సరాల బోధనా అనుభవం ఉంది. అలాగే, గత 7 సంవత్సరాలుగా యూనివర్సిటీ NSS ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు.ఇప్పటివరకు ఆయన 7 అంతర్జాతీయ స్థాయి పరిశోధన పత్రాలను ప్రఖ్యాత జర్నల్స్‌లో ప్రచురించగా, వాటిలో కొన్ని యూకే మరియు అమెరికాలోని ప్రముఖ రసాయన జర్నల్స్‌లో ప్రచురించబడ్డాయి.డా. విజయ్‌కుమార్‌ 7 అంతర్జాతీయ, 15 జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. అలాగే, సహ రచయితగా ఒక పేటెంట్ దాఖలు చేశారు, అది ప్రస్తుతం సమీక్ష దశలో ఉంది. విద్యా అర్హతల పరంగా, ఆయన GATE (2012), రాష్ట్ర అర్హత పరీక్ష (2012), మరియు జాతీయ అర్హత పరీక్ష (2013) అర్హతలు సాధించి తన ప్రతిభను నిరూపించారు.హైదరాబాదులో ఉన్న పేరొందిన నీట్, ఐఐటీ కోచింగ్ సంస్థల నుండి అత్యుత్తమ జీతాలతో ఉద్యోగ అవకాశాలు వచ్చినా, ఆయన తనలాగా గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన విద్యార్థులకు సేవ చేయడానికి విశ్వవిద్యాలయంలో పనిచేయాలని నిశ్చయించుకున్నారు.డా.విజయ్ కుమార్ చేస్తున్న కృషిని 2024 లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రత్యేకంగా అభినందిచడం జరిగింది.డాక్టరేట్ అందుకున్న సందర్బంగా విజయకుమార్ ని సంప్రదించగా తన ఇంటర్మీడియట్ విద్యని ఏ పి ఆర్ జే సి నాగార్జునసాగర్ లో పూర్తి చేయడం తన జీవితాన్ని మలుపు తిప్పింది అని పేర్కొన్నారు.