

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 30 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:- రహదారి భద్రత ప్రమాణాలు పట్ల అవాహన, ఆచరణతోనే జిల్లాలో రహదారి ప్రమాదాలను నియంత్రించ వచ్చునని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 29న అన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పించి, భద్రత చర్యలు చేపట్టాలని, ప్రజలకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. జిల్లాలో జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు రహదారి భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రహదారి ప్రమాదాలను నియంత్రించుటకు రహదారి భద్రత పట్ల ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే విధంగా చూడాలని, సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగు చేయకుండా చూడాలని, హెల్మెట్ ధరించడం వలన కలిగే ప్రయోజనాలను, ప్రమాదాల్లో స్వల్ప గాయాలతో ఎలా ప్రాణాలతో సురక్షితంగా భయటపడవచ్చునో ద్విచక్ర వాహనదారులకు వివరించాలన్నారు. హెల్మెట్స్ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో గాలి, దుమ్ము నుండి రక్షించడంతోపాటు, సురక్షిత ప్రయాణాన్ని అందిస్తాయన్నారు. ఊహించని ప్రమాదాల నుండి ప్రాణాలను కాపాడే రక్షణ రేఖ వంటిదని హెల్మెట్ ధారణ అన్నారు. కావున, ప్రతీ వాహనదారుడు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో నాణ్యత కలిగిన హెల్మెట్స్ను ధరించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజూ విజిబుల్ పోలీసింగు నిర్వహించాలని, వాహన తనిఖీలు చేపట్టి, ప్రజలకు, వాహనదారులకు రహదారి భద్రత, మోటారు వాహన చట్టం గురించి అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాలను నియంత్రించుటలో భాగంగా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. డ్రంకన్ డ్రైవ్ చేసిన వారిపై కఠినంగా వ్యవహరించి, కేసులు నమోదు చేయాలన్నారు. ప్రజలకు రహదారి ప్రమాదాల పట్ల అవగాహన కల్పిస్తూనే, మరో వైపు ఎం.వి. నిబంధలు ఉల్లంఘిచిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రమాదాల నియంత్రణలో భాగంగా ఇప్పటికే ప్రతీ పోలీసు స్టేషను పరిధిలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద రహదారి ప్రమాదాలు జరగకుండా బ్లాక్ స్పాట్కు ఇరువైపుల కాషనరీ బోర్డులను ఏర్పాటు చేయడం, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్టాపర్లు, డ్రమ్ములు ఏర్పాటు చేసి, రాత్రి సమయాల్లో వాహనదారులకు
కనిపించే విధంగా వాటిపై రేడియం స్టిక్కర్లు అతికించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. హెల్మెట్స్ ధరించని వారిపై 2024వ సంవత్సరంలో 60, 392 మందిపై ఎం.వి.చలానాలను విధించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.