జనం న్యూస్ 26.నవంబర్. కొమురం భీమ్ జిల్లా.
డిస్టిక్ట్ స్టాఫ్ఫర్.కె. ఏలియా.గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిర్వహణా ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జిల్లా పోలీస్ అధికారులు, ఎస్ హెచ్ ఓ లతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని, ఎన్నికల భద్రత, శాంతి భద్రతా చర్యలు, పర్యవేక్షణకు సంబంధించిన సూచనలు, సలహాలు ఎస్పీ అధికారులకు తెలియజేశారు.ఎస్పీ మాట్లాడుతూ—రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికి అక్రమంగా డబ్బు, మద్యం లేదా ఇతర పదార్థాలు రాకుండా చెక్పోస్టుల వద్ద ఇతర శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.విజిబుల్ పోలిసింగ్, నాకబందీలు, ఆకస్మిక తనిఖీలు నిరంతరం జరగాలని తెలిపారు. ఎస్ హెచ్ ఓలు, వీపీవోలు ప్రతి గ్రామాన్ని సందర్శించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించడంతో పాటు గ్రామాల్లో పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమస్యత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని అన్నారు.సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, ఇతరుల భావోద్వేగాలను దెబ్బతీసే విధమైన చర్యలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే లాడ్జీలు, గెస్ట్ హౌసులు, కమ్యూనిటీ హాలులు, ఫంక్షన్ హాలుల్లో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానితుల కదలికలను పర్యవేక్షించాలన్నారు.ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో, రాజకీయ కార్యకలాపాల్లో పోలీస్ సిబ్బంది ఎలాంటి ప్రమేయం ఉండకూడదని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన చోటుచేసుకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.గత ఎన్నికల్లో వివాదాస్పద కేసుల్లో, అలాగే ఇతర కేసుల్లో నమోదైన రౌడీషీటర్లను బైండోవర్ చేసి వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని సూచించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద పకడ్బందీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ పాటు ఏఎస్పీ చిత్తరంజన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ రవీందర్ మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


