ఫతేనగర్ ప్రజల సమస్యలపై ఎంపీ ఈటెల రాజేందర్‌ ప్రత్యేక దృష్టి,ఫతేనగర్‌లో నూతన ఎం.ఎస్. స్టెయిర్‌కేస్ పరిశీలన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు హామీ

September 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని ఫతేనగర్ ప్రజలు గతంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జి స్టెయిర్‌కేస్ సమస్యను మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజల సమస్యపై వెంటనే స్పందించిన ఎంపీ ఫతేనగర్ ఎం.ఎం.టి.ఎస్ రైల్వే స్టేషన్‌లో ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా నూతనంగా ఎం.ఎస్. స్టెయిర్‌కేస్ ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకున్నారు.ఈ సందర్భంగా పలు కార్యక్రమాల నిమిత్తం కూకట్‌పల్లి నియోజకవర్గంలో పర్యటించిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు మరియు నియోజకవర్గ నాయకులతో కలిసి ఫతేనగర్ ఎం.ఎం.టి.ఎస్ రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన స్టెయిర్‌కేస్‌ను పరిశీలించి, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఫతేనగర్ ప్రధాన రహదారిపై విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్డు దాటేందుకు ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయించాలని ఎంపీ ని విజ్ఞప్తి చేశారు.ప్రజల విజ్ఞప్తిపై స్పందించిన ఎంపీ ఈటెల రాజేందర్ సంబంధిత అధికారులతో మాట్లాడి, వీలైనంత త్వరగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు అయ్యే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటానని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు.అదేవిధంగా ఫతేనగర్ స్మశాన వాటికలో సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కూడ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ ప్రజలకు హామీ ఇచ్చారు.ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణమే స్పందిస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ చొరవపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ నాయకులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని వడ్డేపల్లి రాజేశ్వరరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫతేనగర్ డివిజన్ బిజెపి నాయకులు కంచి మహేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ కృష్ణగౌడ్, సతీష్ గౌడ్, నజీర్, ఉదయ్, హరి ప్రసాద్ మరియు కూకట్ పల్లి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper