మెట్పల్లిలో బీఆర్ఎస్ పార్టీ BLAలకు ఓటర్ జాబితా సవరణపై ప్రత్యేక అవగాహన సదస్సు
జనం న్యూస్, జులై 16, జగిత్యాల జిల్లా, మెట్టుపల్లి : మెట్పల్లి పట్టణంలోని విధిత్ రెడ్డి గార్డెన్స్లో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) కోసం ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు హాజరై BLAలకు మార్గదర్శనం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని, ప్రతి అర్హత కలిగిన ఓటరుకు ఓటు హక్కు అందేలా చూడడంలో BLAల బాధ్యత ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను పూర్తి బాధ్యతతో నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అనర్హ నమోదులు, డూప్లికేట్ ఎంట్రీలు, మరణించిన వారి పేర్లను చట్టబద్ధంగా గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు.ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎన్నికల సంఘం విడుదల చేసిన మార్గదర్శకాలను పూర్తిగా అధ్యయనం చేసి ఎలాంటి పొరపాట్లు లేకుండా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంలో BLAల పాత్ర కీలకమని, ప్రతి కార్యకర్త పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ BLAలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.