ePaper

ఏపీలో భానుడి భగభగల మండిపాటు… జిల్లాలకు అలర్ట్….

May 3, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఓ వైపు వేడి… మరోవైపు ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అయితే వేసవి మధ్యలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఓవైపు భానుడి భగభగలు కొనసాగుతుంటే, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఆదివారం ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని.. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) కూడా ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో ఆదివారం రోజున కూడా ఎండ తీవ్రత కొనసాగుతుందని ఎపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ తీవ్రతతో పాటుగా గుంటూరు జిల్లాలోని మేడికొండూరు, పెదనందిపాడు, ఫిరంగిపురం, ప్రత్తిపాడు, తుళ్లూరు, వట్టి చెరుకూరు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 124 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ప్రఖర్ జైన్ చెప్పారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ద్రోణి ప్రభావంతో ఆదివారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.