ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత తగ్గించడం కక్ష సాధింపు చర్య- ఆదాసు విక్రమ్
డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్కు భద్రత పునరుద్ధరించాలని డిమాండ్
జనం న్యూస్-జులై 4- నాగార్జునసాగర్ టౌన్-బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ప్రభుత్వం భద్రతను తగ్గించడంపై నందికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్ పర్సన్ ముఖ్య సలహాదారుడు ఆదాసు విక్రమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల పాటు ఐపిఎస్ అధికారిగా దేశానికి, సుమారు దశాబ్దం పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు ఎన్నో సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రత తగ్గించడం పూర్తిగా కక్షసాధింపు చర్యేనని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందన్నారు. ఇప్పటికే పలుమార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై హత్యాయత్నాలు జరిగాయని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన స్వయంగా వెల్లడించినప్పటికీ కావాలనే భద్రతను తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉందని అదాసు విక్రమ్ఆరోపించారు. గురుకుల విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరంతరం ప్రశ్నించడం, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిత్రుడు, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన పోక్సో కేసులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలంగా స్పందించడం కూడా ఒక కక్షసాధింపు చర్యకు కారణమని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను విరమించి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతను వెంటనే పునరుద్ధరించాలని విక్రమ్ డిమాండ్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఎలాంటి అపాయం జరిగినా దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని ఆదాసు విక్రమ్ పేర్కొన్నారు.తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, వేలాది మంది పేద విద్యార్థుల జీవితాలను మార్చిన నాయకుడికి భద్రత తొలగించడం అత్యంత ఆందోళనకర పరిణామమని వారు పేర్కొంటున్నారు. ఆయన స్వయంగా వివిధ ఇంటర్వ్యూలలో తనకు ప్రాణహాని ఉందని చెప్పిన నేపథ్యంలో భద్రత తొలగించడం పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని, ఇంటెలిజెన్స్ అధికారులను కోరుతున్నారు.డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ భారత పోలీసు సేవలో అత్యంత సమర్థవంతమైన అధికారిగా సేవలందించారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశ సేవ చేశారు. అనంతరం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య, అత్యాధునిక సదుపాయాలు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చి వేలాది మంది పేద, దళిత, గిరిజన, బహుజన విద్యార్థుల జీవితాలను మార్చారు. ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితంగా వందలాది మంది విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందగా, మరెందరో విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు పొందారు. “స్వేరో” అనే ఉద్యమాన్ని ప్రారంభించి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత, నాయకత్వం, రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచారు. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భావజాలాన్ని యువతలో విస్తృతంగా పరిచయం చేస్తూ విద్య ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని ఆయన నిరంతరం ప్రబోధించారు. అందుకే లక్షలాది మంది గురుకుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్వేరో కుటుంబ సభ్యులు, బహుజనవాదులు, అంబేద్కర్ భావజాలాన్ని విశ్వసించే ప్రజలు ఆయనను తమ స్ఫూర్తిగా భావిస్తున్నారు.ఆయన విద్యా రంగంలో చేసిన విశేష సేవలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. గురుకుల విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా కృషి చేయడంతో పాటు పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో ఆయన చేసిన సేవలు అనేక ప్రశంసలు అందుకున్నాయి. దేశవ్యాప్తంగా అనేక విద్యా వేదికలపై ఆయన ప్రసంగాలు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చాయి.ఇప్పటికే తనకు ప్రాణహాని ఉందని ఆయన వెల్లడించిన నేపథ్యంలో భద్రత ఉపసంహరణను వెంటనే పునఃసమీక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా జీవితంలో చురుకుగా ఉన్న నాయకుడి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించరాదని హెచ్చరిస్తున్నారు.ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ శాఖ వెంటనే స్పందించి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్కు తగిన భద్రత కల్పించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు నందికొండ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ఆదాసు విక్రమ్ తెలిపారు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసిన వ్యక్తుల భద్రతను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని వారు స్పష్టం చేశారు.