మెట్పల్లిలో డీఆర్సీసీ షెడ్ నిర్మాణానికి భూమిపూజ
పట్టణ పారిశుద్ధ్య మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : జువ్వాడి నర్సింగరావు
జనం న్యూస్, జూన్ 30, జగిత్యాల జిల్లా మెట్పల్లి: మెట్పల్లి పట్టణంలోని 2వ వార్డులో గల డంపింగ్ యార్డ్లో డీఆర్సీసీ (డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్) షెడ్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర వెల్మ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు, మైలారపు లింబాద్రి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేసేందుకు, వ్యర్థాల సేకరణ, నిర్వహణను శాస్త్రీయ పద్ధతిలో అమలు చేసేందుకు డీఆర్సీసీ షెడ్ నిర్మాణం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించడంతో పాటు పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అలాగే పట్టణ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ప్రజల సహకారంతో మెట్పల్లిని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్, డీఈ, ఏఈ, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు