SIR పై గ్రామ సభలు – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలిజుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి మరియు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ గారు పిలుపు
–తాసిల్దార్ ఎండి ముజీబ్
మద్నూర్ ఆగస్టు 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR ప్రక్రియలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోని గ్రామాలతో పాటు జిల్లా వ్యాప్తంగా రేపు 27.08.2026న గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జుక్కల్ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి మరియు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్ గారు బుధవారం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, SIR ప్రక్రియను పారదర్శకంగా, లోపాలు లేకుండా పూర్తి చేయడమే లక్ష్యమని అన్నారు. గ్రామ సభల్లో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ను బహిరంగంగా చదివి వినిపిస్తామని పేర్కొన్నారు.అదే విధంగా ఈ గ్రామ సభల్లోమరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు, నివాసం మారినవారి – షిఫ్ట్ కేసుల వివరాలు,డబుల్ ఎంట్రీ అయిన ఓటర్ల గుర్తింపు వివరాలు, గైర్హాజరైన ఓటర్ల జాబితాలను చదివి వినిపిస్తామని తెలిపారు.ఈ గ్రామ సభలను ప్రతి ఓటరు, గ్రామ ప్రజలు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని వి. విక్టర్ గారు కోరారు. తమ పేరులో తప్పులు, చిరునామా మార్పులు లేదా తొలగింపులకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటే అక్కడికక్కడే అధికారులకు తెలియజేయాలని సూచించారు.ఈ సభల్లో BLO, BLO సూపర్వైజర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది తో పాటు ఇతర అధికారులు పాల్గొని, నోటీసులు జారీ, విచారణ ప్రక్రియ, అభ్యంతరాల నమోదు విధానం గురించి ప్రజలకు వివరంగా అవగాహన కల్పిస్తారని ఆయన తెలిపారు.ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో సరైన ఓటర్ జాబితా కీలకమని, అందుకే ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని ERO గారు విజ్ఞప్తి చేశారు.