అటవీ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ
జనం న్యూస్- జూన్3 – నాగార్జునసాగర్ టౌన్ – నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్ అటవీ డివిజన్ కార్యాలయం పరిధిలో బుధవారం అటవీశాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హిల్ కాలనీలోని అటవీ శాఖ కార్యాలయంలో ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీని ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సంగీత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఏటా జూన్ 3వ తేదీన అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం గా నిర్వహిస్తారని దీనితోపాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని నిర్వహించామన్నారు. ఈ ర్యాలీ అటవీ శాఖ కార్యాలయం నుండి హిల్ కాలనీ ఇందిరాగాంధీ సర్కిల్ వరకు కొనసాగించామన్నారు. పర్యావరణాన్ని సమతుల్య పరచడంలో వృక్షాల పాత్ర ప్రముఖమైందని వృక్ష సంపదను కాపాడుకుంటూ వాటి సంఖ్యను పెంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ గౌతమ్, సెక్షన్ ఆఫీసర్ రమేష్ మరియు అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.