పోలేరమ్మ తల్లి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ మావుళ్ళమ్మ తల్లి
జనం న్యూస్ సెప్టెంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ – శ్రావణ మాసం, పొలాల అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన పట్టణంలో కొలువైన కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారు పోలేరమ్మ తల్లి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు, సహస్రనామార్చనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వేళ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. దర్శనానికి వచ్చిన భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవస్థానం తరపున పులిహోర ప్రసాదాన్ని వితరణ చేశారు. భక్తులందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అర్చకులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.