కుంగిన వంతెనపై అధికారుల నిర్లక్ష్యం
“పరిశీలనలు కాదు.. ప్రజలకు తక్షణ పరిష్కారం కావాలి” — బీజేపీ సీనియర్ నాయకులు కాంచి మహేందర్
జనం న్యూస్ ఆగస్టు 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఫతేనగర్: నేతాజీ కాలనీ–శోభన కాలనీల మధ్య కాలువపై ఉన్న వంతెన కుంగిపోయి ప్రమాదకరంగా మారినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ సీనియర్ నాయకులు కాంచి మహేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వంతెనకు ఆనుకుని భారీగా చెత్త పేరుకుపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. సుమారు పది రోజుల క్రితం మాజీ కార్పొరేటర్, ఏఈ అధికారులు అక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.కుంగిపోయిన వంతెనతో పాటు పేరుకుపోయిన చెత్త కారణంగా ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకముందే అధికారులు స్పందించాలని కాంచి మహేందర్ డిమాండ్ చేశారు.“అధికారులు వచ్చారు.. పరిశీలించారు.. వెళ్లిపోయారు. కానీ సమస్య మాత్రం అలాగే ఉంది. పరిశీలనలు, హామీలతో సమస్య పరిష్కారం కాదు. ప్రజలకు తక్షణమే శాశ్వత పరిష్కారం కల్పించాలి” అని ఆయన అన్నారు.ఫతేనగర్లో నెలకొన్న ఈ పరిస్థితిపై అధికారులు వెంటనే స్పందించి కుంగిపోయిన వంతెనకు మరమ్మతులు చేపట్టడంతో పాటు పేరుకుపోయిన చెత్తను తొలగించాలని కాంచి మహేందర్ కోరారు. “ఇదేనా మన ఫతేనగర్ పరిస్థితి?” అని ఆయన ప్రశ్నించారు.