రిటైడ్…బట్ నాట్ టైడ్…అంటున్న పాలిటీ గురువు గుర్రం ప్రభాకర్ రెడ్డి…
మూడు దశాబ్దాలకు పైగా విద్యాబోధన.. వేలాది మంది విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసిన అరుదైన అధ్యాపకుడు
జనం న్యూస్ ఆగస్టు 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆయన అడుగుల సవ్వడి వినిపిస్తే చాలు… వందల గొంతుల సందడితో నిండిన తరగతి గది ఒక్క క్షణంలో నిశ్శబ్దానికి నిలయమవుతుంది. ఆ నిశ్శబ్దంలోనూ ఓ ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అది సాధారణ కంఠం కాదు… కంచు కంఠం. ఆ స్వరంలో ఆజ్ఞతో పాటు ఆప్యాయత ఉంటుంది. ఆయన మాటల్లో పాఠ్యాంశం మాత్రమే కాదు.. జీవితానుభవం కూడా కనిపిస్తుంది.అక్షరాలను పలికితే అవి కేవలం మాటలుగా మిగలవు. విద్యార్థుల మదిని తాకే పదునైన బాణాలుగా మారుతాయి. ఎంత క్లిష్టమైన అంశమైనా అరటిపండు ఒలిచినంత సులభంగా విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించడం డాక్టర్ ప్రభాకర్ రెడ్డి బోధనా శైలిలోని ప్రత్యేకత.తరగతి గదిలో పది వరుసల బెంచీలు ఉన్నా ఆయన చూపు చివరి బెంచ్ వరకు చేరుతుంది. ముందు వరుసలో కూర్చున్న విద్యార్థినే కాదు.. చివరి వరుసలో నిశ్శబ్దంగా కూర్చున్న విద్యార్థి కళ్లలోని సందేహాన్ని సైతం గుర్తించే గురుదృష్టి ఆయన సొంతం.మూడు దశాబ్దాల బోధనా ప్రస్థానంమూడు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన అధ్యాపక ప్రస్థానంలో తరాలు మారాయి.. తరగతి గదులు మారాయి.. విద్యార్థుల ముఖాలు మారాయి. కానీ విద్యార్థుల పట్ల ఆయనకున్న ఆప్యాయత మాత్రం మారలేదు.ఏళ్ల క్రితం తన తరగతి గదిలో కూర్చున్న విద్యార్థి పేరును సైతం జ్ఞాపకాల పొరల్లోంచి వెలికి తీసి, “ఎలా ఉన్నావు?” అంటూ అదే ఆప్యాయతతో పలకరించడం ఆయనలోని ప్రత్యేకతకు నిదర్శనం.ఆయన చేతిలోని పుస్తకం కేవలం పాఠ్యాంశాలను నేర్పే సాధనం కాదు. జీవితాన్ని చదివించే ఒక మార్గదర్శి. ఆయన పలికే ప్రతి మాటలో ఓ పాఠం ఉంటుంది. బోధనను కేవలం ఉద్యోగంగా కాకుండా తపస్సుగా భావించిన ఆయన.. విద్యార్థులను హాజరు పట్టికలోని పేర్లుగా చూడలేదు. తన జ్ఞాపకాలలో చెరిగిపోని అక్షరాలుగా భావించారు.అందుకే ఆయన అడుగుల సవ్వడికి తరగతి గది నిశ్శబ్దమవుతుంది. ఆయన మాటలకు విద్యార్థుల మనసులు తెరుచుకుంటాయి. ఆయన బోధనతో పాఠాలు పూర్తికావు.. వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటాయి.విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలుడాక్టర్ ప్రభాకర్ రెడ్డి జీవితంలో విద్యాభ్యాసం ఒకవైపు కొనసాగుతుండగానే.. మరోవైపు నాయకత్వ లక్షణాలు కూడా రూపుదిద్దుకున్నాయి. సామాజిక అంశాలపై ఆసక్తి, సమకాలీన రాజకీయ రిణామాలపై నిశిత పరిశీలన, ప్రజా సమస్యలపై స్పందించే స్వభావం ఆయన నాయకత్వానికి పునాదిగా నిలిచాయి.ఉన్నత పాఠశాలలో చదువుతున్న రోజుల నుంచే విద్యార్థుల సమస్యలపై స్పందిస్తూ వారి తరఫున నిలబడే స్వభావాన్ని అలవర్చుకున్నారు. ఆ క్రమంలో స్కూల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికై విద్యార్థి నాయకత్వానికి తొలి అడుగు వేశారు.ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా విజయం సాధించి తన నాయకత్వ సామర్థ్యాన్ని మరింతగా చాటుకున్నారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడం, వాటిపై చర్చించడం, పరిష్కార మార్గాలను సూచించడం వంటి అంశాలు ఆయనలోని నాయకత్వ లక్షణాలకు మరింత పదును పెట్టాయి.నాగార్జునసాగర్లోనూ కొనసాగిన నాయకత్వ ప్రస్థానంనాగార్జునసాగర్లోని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలోనూ ఆయన నాయకత్వ ప్రస్థానం కొనసాగింది. అక్కడ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.అలా విద్యార్థి దశలోనే నాయకత్వ పాఠాలు నేర్చుకున్న ఆయన.. అనంతరం అధ్యాపకుడిగా వేలాది మంది విద్యార్థులకు జ్ఞానాన్ని పంచుతూ వారి భవిష్యత్ నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించారు.తరగతి గది ఆయనకు పాఠాలు నేర్పితే.. సమాజం ఆయనకు జీవితాన్ని నేర్పింది. విద్య ఆయనకు ఉద్యోగం కాదు.. బాధ్యత. బోధన ఆయనకు వృత్తి కాదు.. ఒక తపస్సు.ఆగస్టు 30న ఉద్యోగ విరమణ వేడుకమూడు దశాబ్దాలకు పైగా విద్యారంగానికి సేవలందించిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆగస్టు 30న ప్రత్యేకంగా ఉద్యోగ విరమణ వేడుకలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఆయనతో అనుబంధం ఉన్న సహచర అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, అభిమానులు ఆయన సేవలను స్మరించుకోనున్నారు. ఒక అధ్యాపకుడి ఉద్యోగ విరమణ అనేది కేవలం ఒక సేవా అధ్యాయం ముగియడం మాత్రమే కాదు.. ఆయన బోధనతో వెలుగొందిన వేలాది జీవితాల్లో ఆయన జ్ఞాపకాల ప్రయాణం మరింత ముందుకు సాగడం.తరగతి గదిలో ఆయన స్వరం ఇక ప్రతిరోజూ వినిపించకపోయినా.. ఆయన చెప్పిన మాటలు, నేర్పిన విలువలు, చూపిన మార్గం మాత్రం ఆయన విద్యార్థుల జీవితాల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి.డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉద్యోగ విరమణ పొందుతున్నా.. గురువుగా ఆయన ప్రస్థానానికి మాత్రం విరామం లేదనే చెప్పాలి.