

జనం న్యూస్,మార్చి 15, అచ్యుతాపురం: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మండలం లోని ఎం. జగన్నాధపురం గ్రామానికి వచ్చిన అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి సీఐటీయూ నాయకులు మరియు కార్మికులు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రాము, మండల కార్యదర్శి సోమునాయుడు మాట్లాడుతూ 25 సంవత్సరాలు పైగా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు చాలీచాలని జీతాలు చెల్లిస్తున్నారని దీంతో వీరి ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనంగా నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని, బకాయి జీతాలు చెల్లించి గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ,పిఎఫ్,సెలవులు వంటి సౌకర్యాలు కల్పించాలని, దిబ్బపాలెం, పూడిమడక పంచాయతీ కార్మికులకు ఆదివారం సెలవు ఇవ్వాలని, రిటైర్ అయిన వారికి గ్రాడ్యుటి,పింఛన్ సౌకర్యం కల్పించాలని పనిలో ప్రమాదాలు జరిగితే ప్రభుత్వం లేదా పంచాయతీ వైద్య సేవలు అందించి, గ్లౌజులు ,బూట్లు, మాస్కులు, నూనె,సబ్బులు,పనిముట్లు నాణ్యమైనవి సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికుల కన్వీనర్ ఆడారి. నాగేశ్వరరావు ,నాగమణి, శ్రీరాములు, రమణ,కల్యాణి వివిధ గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.