

జనం న్యూస్ 16 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషను పరిధిలో నివసిస్తున్న రౌడీ షీట్లు మరియు ఇతర బ్యాడ్ క్యారక్టరు షీట్లు కలిగిన వ్యక్తులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో సంబంధిత పోలీసు అధికారులు మార్చి 15న జిల్లాలోని ఆయా పోలీసు స్టేషన్లకు పిలిచి, మంచి ప్రవర్తన కొరకు కౌన్సిలింగు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన, వారు నిర్వర్తించే పనులు, ప్రస్తుత వారి జీవన విధానం పట్ల నిఘా పెట్టాలని అధికార్లును జిల్లా ఎస్పీ ఆదేశించారు. రౌడీ షీటర్ల దురుసుగా ఉంటూ, మళ్ళీ నేరంకు పాల్పడే అవకాశం ఉన్నట్లుగా వారి ప్రవర్తన ఉన్నట్లయితే వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, వారిని మంచి ప్రవర్తన కొరకు బైండోవరు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. నేర ప్రవృత్తిని విడనాడకుంటే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాలన్నారు. అదే విధంగా వివిధ బ్యాడ్ క్యారక్టరు షీట్లు కలిగిన వ్యక్తులను వారు నివాసం ఉంటున్న పరిధిలో పోలీసు స్టేషనుకు పిలిచి, కౌన్సిలింగు నిర్వహించాలని అధికారులను జిల్లాఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా వారి జీవనోపాధికి చేస్తున్న వృత్తులు, ఎక్కడ పని చేస్తున్నదన్న విషయాలపై ఆరా తీయాలన్నారు. బిసి షీట్లు కలిగిన వ్యక్తులకు లేటెస్ట్ ఫోటోలు తీసి, హిస్టరీ షీట్లులో పొందుపర్చాలని, వారి వివరాలను, ఫోటోలను సిసిటిఎన్ఎస్ లో నిక్షిప్తం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. జిల్లా ఎస్పీగారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ స్టేషను పరిధిలోని బిసిలను, రౌడీలను స్టేషనుకు పిలిచి, వారి నేర ప్రవర్తన, గురించి జీవనోపాధి, చేస్తున్న వృత్తులు గురించి ఆరా తీసి, రికార్డుల్లో వివరాలను నమోదు చేసారు.