

*గ్రామ సభల ద్వారా తుది లబ్ధిదారుల ఎంపిక
*జనవరి 26 నుంచి 4 నూతన పథకాల అమలు
*వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం వర్తింపు
*20 రోజులు ఉపాధి హామీ పని చేసిన భూమి లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
*ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, తదితర అంశాలపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
జనం న్యూస్, జనవరి 16, పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి
అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పట్టిష్ట కార్యాచరణ అమలు చేయాలని
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
బుధవారం మంథని లోని శ్రీ లక్ష్మీ భారతి ఫంక్షన్ హల్ లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డుల జారీ, తదితర అంశాలపై నిర్వహించిన మంథని నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయబోతున్న 4 నూతన పథకాలకు అర్హులైన లబ్ధిదారులను, అనర్హులను ఎంపిక చేసి గ్రామ సభ ల ద్వారా ఆ జాబితాను ఆమోదింప చేసుకోవాలని అన్నారు. గ్రామ సభ ల ద్వారా ఆమోదింప చేసుకున్న జాబితా జనవరి 25 లోపు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.
రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రతి మండలంలోని తహసిల్దార్, మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్లు, మైనింగ్ , సంబంధిత అధికారులు సంయుక్తంగా పని చేసి పట్టా దార్ పాస్ పుస్తకాల డేటా, గూగల్ మ్యాప్ , రెవెన్యూ మ్యాప్ వారీగా పరిశీలిస్తూ భూ భారతి (ధరణి) నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి సదరు లబ్దిదారులను తొలగించాలని అన్నారు.
రాళ్లు రప్పలు ఉన్న భూములు, సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ చేసిన భూములు, పరిశ్రమల భూములు (రైస్ మిల్ పెట్రోల్ బంక్, ఆహార శుద్ధి పరిశ్రమ….), నాలా కన్వర్షన్ జరిగిన భూములు, లేఔట్ ఉన్న భూములు, ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తు భూములు, రొడ్ల భూములు, భవనాలు నిర్మించుకున్న భూముల, మైనింగ్ జరుగుతున్న భూముల వివరాలు రైతు భరోసా నుంచి తొలగించాలని అన్నారు.
భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలకు రెండు విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిందని, 2023-24 సంవత్సరానికి 20 రోజులు పని చేసిన భూమి లేని రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. ఈ పథకం కుటుంబం యూనిట్ గా అందించడం జరుగుతుందని, వ్యక్తిగతంగా అందించే పథకం కాదని అన్నారు.
ప్రతి రెవెన్యూ గ్రామాన్ని జీపి వారిగా మ్యాప్ చేయాలని అన్నారు. జిల్లాలో 20 రోజులు ఉపాధి హామీ కూలీలుగా పని చేసిన కార్మికుల జాబితాను తీసుకొని ఆధార్ కార్డు ట్యాగ్ ప్రకారం పరిశీలిస్తూ భూమిలేని కుటుంబాలను ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామ సభలో ఎంపిక చేసిన జాబితా పై ఏవైనా అభ్యంతరాలు వస్తే సంబంధిత ఎంపిడీఓ 10 రోజుల లోగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సామాజిక ఆర్థిక సర్వే కింద మన పెద్దపల్లి జిల్లాలో తేలిన ఆహార భద్రత కార్డులు లేని కుటుంబాలకు మండలాలలో ఎంపీడీవోలు, పట్టణాలలో మున్సిపల్ కమిషనర్ లు నూతన రేషన్ కార్డుల జారీ పర్యవేక్షించాలని అన్నారు. గ్రామ లేదా వార్డు సభల ద్వారా అర్హులైన జాబితాన్ని ఆమోదింప చేసుకొని రేషన్ కార్డులను 75 గణతంత్ర దినోత్సవ సందర్భంగా నూతన రేషన్ కార్డుల ప్రోసిడింగ్స్ పంపిణీ చేయాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్వహించిన సర్వేలో భూములు ఉన్న అత్యంత పేదలకు మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో స్క్రూటినీ నిర్వహించి 13.93 లక్షల దరఖాస్తులను మొదటి విడతలో పరిశీలనకు జిల్లాలకు అందిస్తున్నారని, మనకు వచ్చిన దరఖాస్తులను మరొకసారి చెక్ చేసుకోని, గ్రామాల వారీగా అర్హులను ఎంపిక చేసుకొవాలని, ఎటువంటి ఒత్తిడులకు గురికాకుండా అత్యంత పేదలను ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు.
గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న 4 కార్యక్రమాల మార్గదర్శకాలు, ఉద్దేశం ప్రజలకు వివరిస్తూ పథకాల అర్హుల జాబితాను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలని, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత తుది జాబితా తయారు చేయాలని అన్నారు.
జనవరి 23 లోపు గ్రామ సభల నిర్వహణ పూర్తి చేయాలని, గ్రామ సభ ఆమోదించిన తరువాత తుది జాబితా ఆన్ లైన్ లో జనవరి 25 సాయంత్రం లోపు నమోదు చేయాలని, జనవరి 26 నుంచి 4 పథకాల అమలును ప్రారంభించాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాళిందిని, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, జడ్పీ సీఈవో , జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్,తదితరులు పాల్గొన్నారు.