Listen to this article

జనం న్యూస్ 1మే. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కంటే ఏలియా.


కార్మికుల పోరాటాల్లో నుంచి పుట్టింది మేడే. సర్వసంపదలు సృష్టించేది శ్రామిక వర్గం. శ్రమ జీవులు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తా ఏమిటో చాటారు. 8 గంటల పని హక్కు కోసం ఆనాటి ప్రభుత్వాల మెడలు వంచి పని గంటల హక్కు సాధించారు. తమ హక్కుల సాధన కోసం వందలాది మంది ప్రాణాలర్పించారు. 1886 మే 3వ తేదీన చికాగో లోని హే స్క్వేర్‌ వద్ద పోలీసు కాల్పుల్లో ఒక వైపు రక్తం చిందుతుంటే మరోవైపు ఆ రక్తంలో తడిచిన ఎర్రబట్టను తమ జెండాగా పైకెత్తి చూపారు. కార్మికవర్గ త్యాగం అంటే అది. కార్మిక హక్కులు, పోరాటాలు, త్యాగం తోనే సాధించుకుంటాం. పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో శ్రామికులు బానిసలవలే పని చేసేవారు. కార్మికులు రోజుకు 16 నుంచి 20 గంటల వరకు పని చేసేవారు. 19వ శతాబ్దం ప్రారంభం నుంచి కార్మికులు తిరుగుబాట్లు ప్రారంభించారు. 1806లో ఫిలడెల్ఫియా (అమెరికా)లో కార్మికులు సమ్మె చేశారు. ఆనాడు కార్మికులకు ఎటువంటి భద్రత గాని, సౌకర్యాలు గాని వుండేవి కాదు. ఫ్యాక్టరీల్లో గాలి, వెలుతురు సౌకర్యాలు మృగ్యం. కార్మికులకు యంత్రాల నుండి రక్షణ లేదు. తరచుగా ప్రమాదాలకు గురై మరణించేవారు. కార్మికులు అమానుష శిక్షలకు గురౌతుండేవారు. కార్మికులు తమ పీడనకు వ్యతిరేకంగా యంత్రాలను ధ్వంసం చేసేవారు. ఈ విధ్వంసకాండ బ్రిటన్‌లో ప్రారంభమైంది. యంత్రాలను విచ్ఛిన్నం చేసేవారికి మరణశిక్ష విధిస్తూ బ్రిటన్‌లో చట్టం చేయబడింది. ఈ దుస్థితి నుంచి బయట పడడానికి పోరాటం సల్పడం ఒక్కటే మార్గమని కార్మిక వర్గం అర్ధం చేసుకుంది. కార్మిక వర్గం చైతన్యవంతంగా వున్న దేశాల్లో ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణం ప్రారంభమైంది. 1806లో ఫిలడెల్ఫియా నగరంలో ‘మెకానిక్స్‌ యూనియన్‌’ పేరుతో కార్మిక సంఘాన్ని స్థాపించారు. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో కార్మికులు సంఘాలను నిర్మించుకొని పోరాటాలు సాగించారు. ట్రేడ్‌ యూనియన్ల మహత్తర శక్తిని చూసి పాలకులు హడలెత్తిపోయారు. ట్రేడ్‌ యూనియన్లు నిర్మించుకోవడం చట్ట విరుద్ధమని పాలకులు ప్రకటించారు. ట్రేడ్‌ యూనియన్లను నిషేధించారు. అయినా ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణం వేగంగా సాగింది. 1848లో కారల్‌మార్క్స్‌ ‘కమ్యూనిస్టు ప్రణాళిక’లో ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అని పిలుపునిచ్చారు. 1871లో ఏర్పడిన మొదటి కార్మికవర్గ రాజ్యం ఫ్రాన్స్‌లో కార్మికవర్గ పోరాటాల ఫలితమే ప్యారిస్‌ కమ్యూన్‌. 1886 చికాగో కార్మికుల పోరాటం
1884 అక్టోబర్‌లో అమెరికా, కెనడాల ఆర్గనైజ్డ్‌ ట్రేడ్‌ అండ్‌ లేబర్‌ యూనియన్ల నాలుగవ మహాసభ జరిగింది. 1886 మే నుండి 8 గంటల పని చట్టబద్దమైన పని దినంగా వుంటుందని తీర్మానం చేసింది. మే 1వ తేదీన సమ్మె చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చింది. ‘మనిషి జీవితంలో రోజులో 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల దినచర్య’ అనే శాస్త్రీయ పద్ధతి కోసం పోరాడాలని నిర్ణయించారు. ఈ పిలుపుకు అశేషమైన స్పందన వచ్చింది. వేలాది మంది కార్మికులు అనేక సంస్ధలు ‘8 గంటల పని దినం’ కోసం మే1వ తేదీన సమ్మెలో పాల్గొన్నారు. చికాగో సమ్మె ఎంతో సమరశీలంగా జరిగింది. అమెరికా ప్రభుత్వం కార్మిక వర్గంపై మే 3వ తేదీన తీవ్ర నిర్బంధం సాగించింది. మే 3వ తేదీన జరిగిన పోలీసుల దాడిలో ఆరుగురు కార్మికులు ఆహుతి అయ్యారు. ఎందరో కార్మికులు గాయపడ్డారు. దీనికి నిరసనగా మే 4వ తేదీన చికాగో నగరం లోని హే మార్కెట్‌ వద్ద కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన ప్రశాంతంగా జరిగింది. ఈ ప్రదర్శనపై యజమానులు, ప్రభుత్వ తొత్తులు బాంబుదాడికి పూనుకున్నారు. ఈ ఘర్షణలో నలుగురు కార్మికులు, అనేక మంది పోలీసులు మరణించారు. అల్బర్ట్‌ వర్స్‌సాన్స్‌, ఆగస్టు స్పైయిన్‌, ఆడాల్ఫ్‌ ఫిషర్‌, జార్జి ఏంగెల్స్‌ అనే నలుగురు కార్మిక నాయకులపై అక్రమ కేసులు బనాయించి 1887 నవంబర్‌ 11న ఉరితీశారు. ఉరికంబం ఎక్కే ముందే స్పైయిస్‌ తన చివరి మాటగా ‘మా మాటల కన్న, మా మూగబోయిన గొంతులు రణఘోషగా మోగే కాలం తప్పక వస్తుంది’ అన్నారు. మరో ముగ్గురు నాయకులకు యావజ్జీవ శిక్ష విధించారు. వీరిని 1893లో విడుదల చేశారు. ఇలానీస్‌ రాష్ట్ర నూతన గవర్నర్‌ వీరిపై నేరం రుజువు కాలేదని ప్రకటించాల్సి వచ్చింది. అమెరికా బూర్జువా న్యాయం బహిర్గతం అయ్యింది. అనేక మంది సమరశీల నాయకులను కూడా దీర్ఘకాలిక జైలుశిక్షలకు గురిచేశారు. అమెరికన్‌ కార్మికుల త్యాగం వృధా కాలేదు. అభివృద్ధి చెందుతున్న యూరప్‌ కార్మిక ఉద్యమం వారితో చేతులు కలపాలని నిర్ణయించింది. 1889లో ప్యారిస్‌లో జరిగిన సోషలిస్టు ఇంటర్నేషనల్‌ మొదటి కాంగ్రెస్‌ మేడేను అంతర్జాతీయ కార్మికదినంగా అమలు చేయాలని తీర్మానాన్ని రూపొందించింది. మొదటి మేడే జరిగిన తీరు కార్మికవర్గ కార్యక్రమాలు బాగా పెరిగాయి. వారి చైతన్యం పెరిగింది. ఐరోపా అన్ని దేశాల్లో పెద్ద సంఖ్యలో సమ్మె పోరాటాలు సాగాయి. ఎన్నికలు, పార్లమెంటరీ రంగాల్లో కార్మిక వర్గం ఎన్నో విజయాలను సాధించింది. ప్యారిస్‌ మహాసభ ఇచ్చిన పిలుపుతో ఐరోపా, అమెరికాలలో ఎన్నడూ లేని ఉత్సాహానికి దారి తీసింది. 1890 మేడే నాడు ఐరోపా అంతటా పారిశ్రామిక నగరాల్లో లక్షలాది మంది కార్మికులతో వీధులు నిండిపోయాయి. జర్మనీ, ఫ్రాన్స్‌, డెన్మార్క్‌ లోని అనేక నగరాలలో కార్మికులు ఫ్యాక్టరీల్లో సమ్మె చేసి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పాటించారు. అనేక నగరాల్లో సామూహిక ప్రదర్శనలు సాగాయి. చిన్న దేశాలైన వియన్నాలో లక్ష మంది, బుడాఫెస్ట్‌లో 66 వేల మంది, మార్సెల్స్‌లో 50 వేల మంది, ప్రాగ్‌లో 30 వేల మంది, స్టాకహేోం, చికాగో నగరాల్లో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. స్పెయిన్‌, బ్రిటన్‌లలో మే 4వ తేదీన అంతర్జాతీయ సౌహార్ధతను ప్రదర్శించారు. బార్సెలోనా లో లక్ష మందితో ప్రదర్శన సాగింది. జర్మనీలో మే 4న జరిగిన ప్రదర్శనలో ఏంగెల్స్‌ పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఎంతో ఉత్సాహభరితంగా జరిగినట్లు బెబెల్‌కు రాసిన లేఖలో తెలియజేశారు. ‘నేను పాల్గొన్న ఈ ప్రదర్శనలో పెద్ద ట్రక్కు పైనుంచి కనుచూపు మేర వరకు ప్రజా సమూహాన్ని చూశాను’ అన్నారు ఏంగెల్స్‌. 1890 మే 1వ తేదీన మొదటి మేడే సందర్భంగా ఇటలీలో పోలీసులతో ఘర్షణ జరిగింది. ఆ తరువాత సంవత్సరాలలో ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌ దేశాలలో ఘర్షణలు సాగాయి. ఉత్తర ఫ్రెంచి నగరమైన ఫోర్మిస్‌లో శాంతియుతంగా సాగే మేడే ప్రదర్శనపై రైఫిల్‌ కాల్పులు జరిగాయి. 50 మంది స్త్రీలు, ఫురుషులు నేలకొరిగారు. పది మంది అక్కడికక్కడే మరణించారు.రాజకీయ పోరాటం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మార్క్సిస్టు కార్యక్రమం ప్రాతిపదికగా కార్మిక వర్గ సోషలిస్టు పార్టీలు ఆవిర్భవించసాగాయి. ఈ పార్టీలు నూతన సోషలిస్టు అంతర్జాతీయ సంస్ధను ఏర్పాటు చేసేందుకు పారిస్‌లో సమావేశం అయ్యాయి. ఇది రెండవ అంతర్జాతీయ సంస్థగా ప్రసిద్ధి చెందింది. మొదటి సమావేశానికి ఏంగెల్స్‌ హాజరయ్యారు. ఈ పార్టీలన్నింటికి ఆయన మార్గదర్శకులుగా వున్నారు. నూతన అంతర్జాతీయ కార్మిక సంస్థకు ఏంగెల్స్‌ సరైన రాజకీయ, నిర్మాణ మార్గదర్శకత్వాన్ని సమకూర్చారు. మేడే ను అంతర్జాతీయం చేయాలని నిర్ణయించారు. తక్షణ ఆర్థిక కోర్కెలకు మాత్రమే పరిమితం కాకుండా పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చేయాలనే అంతిమ లక్ష్యంతో జత చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఒక వర్గంగా నిర్మాణయుతమైన కార్మికవర్గం మాత్రమే కార్మికులను, మొత్తం మానవజాతిని విముక్తి చేయగలదు. పెట్టుబడిని స్వాధీనం చేసుకొనేందుకు, ఉత్పత్తి సాధనాలను ప్రజల ఆస్తిగా మార్చేందుకు నిర్మాణయుత కార్మికవర్గం రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకోవాలని కూడా పిలుపునిచ్చారు. మేడేని కార్మిక వర్గం తక్షణ కోర్కెలతో పాటు, ఆ వర్గపు అంతిమ లక్ష్యమైన సోషలిజంతో ముడి పెట్టారు. ఆర్థిక కోర్కెలు సహితం విప్లవాత్మక స్వభావం కలిగి వుండాలి. అవి కార్మికుల విప్లవకర చైతన్యాన్ని పెంచాలి. రాజకీయ పోరాటానికి సహాయ పడాలి. ఈ రోజు గురించిన అంతర్జాతీయ ప్రాధాన్యతను ఎత్తిచూపడంతో సరిపోదు, దానిని కీలకమైన జాతీయ రాజకీయ డిమాండ్లతో జత చేయాలి. అన్ని రకాల దోపిడికి, అన్ని విధాల నియంతృత్వానికి, వివిధ రకాల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, సోషలిస్టు విధాన సమాజ సాధనకు సాగించే పోరాటంలో తమ ఐక్యతను ప్రదర్శించాలి. 1862 లోనే హౌరా రైల్వే కార్మికులు 8 గంటల పనిని డిమాండ్‌ చేశారు. 20వ శతాబ్దం 20, 30 దశకాలలో కమ్యూనిస్టులు మినహా మరెవ్వరూ మేడే జరిపేవారు కాదు. కాని నేడు అన్ని కార్మిక సంఘాలు మేడే ని జరుపుతున్నాయి. సోషలిజం సాధించడం కార్మిక వర్గ లక్ష్యంగా వుండాలి.