Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.

జనం న్యూస్ 03 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు స్టేషను పరిధిలోని శివరాంపురం గ్రామ శివార్లలోని మామిడి తోటలో
ఆన్లైను క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ప్రధాన నిందితులతో సహా 11మందిని అరెస్టు చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మే 2న వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – బొబ్బిలి పోలీసు స్టేషను పరిధిలోని శివరాంపురం గ్రామ శివార్లలోగల మామిడితోటలో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, విచారణ చేయగా, ఐపిఎల్ క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయ్యిందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ముసిడిపల్లి దివాకర్ (ఎ-1) క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతూ, బెట్టింగులతో నగదు సంపాందించాలనే లక్ష్యంతో బెంగుళూరుకు చెందిన నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి వద్ద నుండి ‘రాధే ఎక్చేంజ్’ అనే బెట్టింగు యాప్ అడ్మిన్ తీసుకొని, యువతను ఆకర్షించేందుకు విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం జిల్లాల్లో కమీషను ఇస్తూ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఏజంటును నియమించుకొన్నారన్నారు. ఏజంట్లుగా నియమించినబడిన వ్యక్తులందరూ
బెట్టింగు యాప్ను ప్రమోట్ చేస్తూ, యువతను ఆకర్షిస్తూ, వాట్సాప్ ద్వారా లింకులను షేర్ చేస్తూ, ఒక పథకం
ప్రకారం బెట్టింగులకు పాల్పడుతున్నారన్నారు. బెట్టింగులకు మరింత విస్తృతం చేయాలనే ఉద్ధేశ్యంతో ముసిడిపల్లి దివాకర్ (ఎ-1), పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన గుండాల నవీన్, ఈదుబిల్లి సంతోష్ లతో కలసి నేషనల్ ఎక్చేంజ్ అనే మరో బెట్టింగు యాప్ అడ్మిన్ ఐడిని తీసుకొన్నట్లుగా విచారణలో వెల్లడయ్యిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ యాప్లను సుమారు 200మంది యువకులు విజయనగరం, పార్వతీపురం మన్యం మరియు విశాఖపట్నం జిల్లాల్లో వినియోగిస్తూ, బెట్టింగులకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామన్నారు. ఈ బెట్టింగులకు పాల్పడుతున్న 11మందిని అరెస్టు చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. వారిలో ముసిడిపల్లి దివాకర్ (అడ్మిన్), అంబటి రాంమోహన్ (అడ్మిన్), మహంతి గణేష్ (ఏజంట్), సామిరెడ్డి వాసు (ఏజంట్) కొట్టంగి మోహనరావు (ఏజంట్), మోడడ్ల పైడిరాజు (ఏజంట్), తాటి శంకరరావు (ఏజంట్), గేదెల శ్రీనివాస్ (యూజర్), సీరపు నారాయణరావు (యూజర్), తెర్లి మోహనరావు (యూజర్)
ఉన్నారన్నారు. వీరి వద్ద నుండి రూ.14,02,000/-ల నగదు, లెనోవ ల్యాప్ టాప్, ఎపి 05 ఈవై 4567 నంబరు గల
కారు, 13 మొబైల్ ఫోన్లును సీజ్ చేసామన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిరంజన్ రెడ్డి (అడ్మిన్), ఈదురపల్లి సంతోష్ (అడ్మిన్), కార్తీక్ (అడ్మిన్), నవీన్ (అడ్మిన్) కోసం గాలిస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు అయిన ముసిడిపల్లి దివాకర్ ఏజంట్లుకు 3శాతం కమీషను ఇవ్వడంతోపాటు, పోగొట్టుకున్న వ్యక్తుల నగదులో 50శాతం సొమ్మును ఏజంట్లుకు ఇచ్చి. వారిని బెట్టింగు యాప్ ప్రమోట్ చేసేందుకు ప్రోత్సహించేవాడని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ లతో డబ్బులు సంపాదించడం సాధ్యం కాదని, యాప్ నిర్వాహకులు డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతోనే యాప్ లను తయారు చేసి, యువతను ఆకర్షిస్తారన్నారు. జీవితాలను నాశనం చేసే ఆన్లైన్ బెట్టింగుల జోలికి పోవద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. ఆన్లైను క్రికెట్ బెట్టింగు ముఠాను గుట్టురట్టు చేయుటలో క్రియాశీలకంగా పని చేసిన బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, బొబ్బిలి సిఐ కే.సతీష్ కుమార్, బొబ్బిలి ఎస్ఐ ఆర్.రమేష్, కానిస్టేబుళ్ళు ఎన్.సత్యన్నారాయణ, పి.సతీష్ కుమార్. కే. ఎర్రం నాయుడు, పి.అప్పారావులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, బొబ్బిలి సిఐ కే.సతీష్ కుమార్, ఎస్పీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఎస్ఐ రమేష్ కుమార్ పాల్గొన్నారు.