Listen to this article

జనం న్యూస్ 17 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విశాలాంధ్ర – పెందుర్తి : ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర వ్యవస్థాపకులు, అర్చకులు ఏలూరు వెంకట రమణమూర్తి (రాజేష్ శర్మ) హైదరాబాదుకు చెందిన ప్రముఖ సేవా సంస్థ రితిక ఫౌండేషన్ అందించనున్న బెస్ట్ నంది అవార్డు- 2025కు ఎంపికయ్యారు. ఈనెల 25న హైదరాబాదులోని లకిడికాపూల్ రితిక ఫౌండేషన్ కార్యాలయంలో రాజేష్ శర్మకు ఆ సంస్థ ప్రతినిధులు, ప్రముఖులు అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ మేరకు ఆహ్వానం అందుకున్న రాజేష్ శర్మ కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి హైదరాబాదు వెళ్లనున్నారు. బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధిగా ఆయా సామాజిక వర్గీయుల కోసం రాజేష్ శర్మ గత కొన్నేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు వైద్య సాయం, పిల్లలకు పుస్తకాలు పంపిణీ, జర్నలిస్టులకు సత్కారం, ఆధ్యాత్మిక బోధనలు వంటి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించే రాజేష్ శర్మను గతంలో అనేక సంస్థలు ఘనంగా సత్కరించి అవార్డులను ప్రధానం చేశాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రితిక ఫౌండేషన్ నుండి నంది అవార్డు లభించడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందన్నారు. ఈ అవార్డు తనలో మరింత బాధ్యతను, సేవాభిలాషను, ఆధ్యాత్మికతను పెంచిందని పేర్కొన్నారు. తన సేవలను గుర్తించిన రితికా ఫౌండేషన్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.