Listen to this article

జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం


దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి, కంప్యూటర్ యుగానికి నాంది పలికిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి మండల నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడం, పరిశ్రమలకు రాయితీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. అతిచిన్న వయసులోనే ప్రధాని పీఠాన్ని అధిరోహించి, దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయన్నారు. యువతలో శక్తివంతమైన మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ మండల నాయకులు శానం కుమారస్వామి, మారపెల్లి కట్టయ్య, రమేష్, రాజేందర్, వరదరాజు, మార్కండేయ, రంగుబాబు తదితరులు పాల్గొన్నారు…..