Listen to this article

జనం న్యూస్ మే 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో

ఆసిఫాబాద్ జిల్లాలో ఇటీవల పెద్దపులిని హతమార్చిన ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకుని తీసుకున్నారు. నిందితులను విచారిస్తున్నామని ఎఫ్డీపీటీ శాంతారం, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రెవాల్ తెలిపారు. పెంచికల్ పేట్ మండలం అగర్ గూడ గ్రామ సమీపంలోని ఎల్లూరు అటవి ప్రాంతంలో పులిని చంపడం కలకలం రేపింది. ప్రభుత్వం, అటవీశాఖ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాయి. కాగజ్ నగర్ అటవీ డివిజన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బెజ్జూరు అటవీ ప్రాంతంలో ఈ నెల 13న చివరగా తమ కెమెరాలకు కనిపించిన పులిని.. మే 14న పెంచికల్ పేట్ మండలంలోని ఎల్లూరు అటవీ ప్రాంతంలో వేటగాళ్లు కరెంట్ వైర్లు అమర్చి హతమార్చారని చెప్పారు. అనంతరం అక్కడ నుంచి 400 మీటర్ల దూరం తీసుకెళ్లి చర్మం, గోళ్లు, దవడలు తొలగించి కళేబరాన్ని పాతిపెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టగా 12 మంది పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.