

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 16 రిపోర్టర్ సలికినీడి నాగు
గతంలో మహానాడు, ఇప్పుడు యోగా డే నిర్వహణలో ప్రజాప్రతినిధులు, ప్రజలతో ప్రత్తిపాటి సమన్వయం బాగుందన్న ముఖ్యమంత్రి
21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణను ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని, దానిలో భాగంగా అధికారులకు, తమకు పలు కీలక సూచనలు చేశారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను ముఖ్యమంత్రి, సహచర ప్రజాప్రతినిధులు, అధికారులుతో కలిసి ప్రత్తిపాటి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తొలుత విశాఖపార్లమెంట్ ప్రజాప్రతినిధులు, మంత్రులు, అధికారులతో చంద్రబాబు నిర్వహించిన కీలక సమావేశంలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతానికి ముఖ్యమంత్రి చేసిన సూచనలపై స్పందించిన ప్రత్తిపాటి తన అభిప్రాయాలు, ఆలోచనల్ని ఆయనతో పంచుకున్నారు. సమావేశానంతరం ముఖ్యమంత్రితో పాటు ప్రత్తిపాటి బీచ్ రోడ్ కు వెళ్లారు. స్థానిక ఆర్.కే బీచ్ లో 5 లక్షల మందితో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం బ్రహ్మండంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిదని, మోదీ హాజరయ్యే కార్యక్రమంలో ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించినట్టు ప్రత్తిపాటి చెప్పారు. అనంతరం బీచ్ రోడ్ పక్కన యోగా దినోత్సవం కోసం చేసిన ఏర్పాట్లను చంద్రబాబుతో కలిసి ప్రత్తిపాటి పరిశీలించారు. అనంతరం ప్రత్తిపాటి కాసేపు ముఖ్యమంత్రితో మాట్లాడారు. ఈ సందర్భంగా మహానాడు నిర్వహణ, తాజాగా జరగబోయే యోగా డే విజయవంతం కోసం ప్రజాప్రతినిధుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రజలతో మమేకం అవతున్న ప్రత్తిపాటిని చంద్రబాబు ప్రత్యేకంగా భుజం తట్టి అభినందించారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం తగిన సహాయసహాకారాలు కావాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని తనను కలిసిన ప్రతిసారి ప్రత్తిపాటి అడుగుతుంటారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.