Listen to this article

జనంన్యూస్.నిజామాబాద్, జూన్ 23

జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సుదీర్ఘ సమీక్ష జరిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం మున్సిపల్ అధికారులతో సమావేశమై ఒక్కో డివిజన్ వారీగా వార్డు ఆఫీసర్లకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎంత మందిని అర్హులుగా గుర్తించారు, ఎన్ని కుటుంబాలకు మంజూరీ పత్రాలు ఇచ్చారు, ఎంత మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు, ప్రస్తుతం అవి ఏ దశలో ఉన్నాయి తదితర వివరాలను డివిజన్ వారీగా ఆరా తీశారు. తిరస్కరించిన దరఖాస్తులను ఏ కారణాల వల్ల రిజెక్షన్ జాబితాలో చేర్చారు అని ప్రశ్నించారు. చిన్నచిన్న కారణాలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపుతూ ఇందిరమ్మ ఇళ్ల లక్ష్య సాధనకు కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. అర్హత కలిగి ఇంటి నిర్మాణానికి ముందుకు వచ్చే ప్రతి కుటుంబానికి ఇల్లు మంజూరయ్యేలా చూడాల్సిన బాధ్యత వార్డు అధికారులదేనని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో నిజామాబాద్ కార్పొరేషన్ ను ముందంజలో నిలుపుదామని అన్నారు. వారం రోజుల అనంతరం తాను మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, ఒక్కో డివిజన్ వారీగా సాధించిన ప్రగతి వివరాలతో నివేదిక అందించాలని సూచించారు. జిల్లా అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిస్తామని, నివేదికలో పొందుపర్చిన వివరాలు తప్పుగా ఉన్నాయని వెల్లడైతే సంబంధిత వార్డు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వాస్తవ నివేదికలు అందించాలని సూచించారు. ఇంటి స్థలం ఉండి, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయ్యేలా చొరవ చూపాలని హితవు పలికారు. మంజూరీలు తెలుపబడిన వారు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా పర్యవేక్షణ జరపాలని, ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలి కాగా, ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్లను ఆదేశించారు. ఎక్కడ కూడా డెంగ్యూ, మలేరియా, అతిసారం, విషజ్వరాలు వంటి వ్యాధులు సోకకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని అన్నారు.
అన్ని డివిజన్లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే ఈగలు, దోమలు, బొద్దింకలు, పురుగుల నివారణ కోసం అందుబాటులో ఉన్న అన్ని ఆధునిక పద్దతులను అవలంభించాలని అన్నారు. నివాస ప్రాంతం వారీగా శానిటేషన్ పనులను అనునిత్యం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మంచినీటి పైప్ లైన్ లకు ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే వాటికి మరమ్మతులు చేయించాలని, ప్రతి ట్యాంకును శుభ్రం చేయిస్తూ క్లోరినేషన్ జరిగేలా చూడాలన్నారు. ఎక్కడ కూడా మురుగు నీరు, వర్షపు జలాలు నిలువ ఉండకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఫాగింగ్, ఆయిల్ బాల్స్ తదితర చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అన్నారు. వ్యాధులు ప్రబలకుండా సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, తహసీల్దార్లు బాలరాజు, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.