

ప్రభుత్వాలు స్పందించకపోతే రైతు పోరాటం తప్పదు.
ఎకరాకు రూ, 30వేలు నష్టపరిహారం చెల్లించాలి
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్
జనం న్యూస్ 31 ఆగస్టు 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా (లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి )
భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం పంట నీట మునిగి పూర్తిగా నష్టపోయిందని ఈ విపత్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్ చేశారు. శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ, 30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట పొలాలతోపాటు, ఇండ్లు ధ్వంసమై నిరాశ్రయులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గుంతలు ఏర్పడిన రోడ్లకు మనమతులు చేపట్టాలని కోరారు. నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు విగ్నేష్, ఏరియా కార్యదర్శి నన్నేసాబ్, మండల కన్వీనర్ నెల్లూరి లక్ష్మణ్, నాయకులు భీమయ్య, అశోక్, భూమయ్య, కిరణ్, రెడ్డి, భూషణం, కుమార్, ఎక్బాల్ తదితరులు పాల్గొన్నారు