విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 04 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా జామి పోలీసు స్టేషను 2024 సం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు
మాదవరాయమెట్ట గ్రామం, జామి మండలంకు చెందిన వంతల శివ, (23 సం.లు)కు విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి కే.నాగమణి 3సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.4,000/-లు జరిమానా
విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ.50,000/- మంజూరు చేస్తూ నవంబర్ 3న తీర్పు వెల్లడించారని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం జిల్లా, జామి మండలం, మాదవరాయమెట్ట గ్రామంలో నివాసం ఉంటున్న నిందితుడు వంతల శివ, (23 సం.లు) తే.06-06-2024దిన అదే గ్రామంలో ఉంటున్న ఒక మైనరు బాలిక (12 సం.లు)ను రాత్రి సుమారు 10 గంటలకు ఇంటి ముందు ఆరు బయట మంచంపై నిద్రిస్తున్న సమయంలో ఎత్తుకొని దగ్గరలో ఉన్న ఒక తోటలోకి తీసుకొని వెళ్ళి, బలవంతం చేయబోగా, మైనారు బాలిక కేకలు వేయగా దగ్గరలో ఉన్న జనం వెంటనే తోటలోకి వచ్చేసరికి నిందితుడు అక్కడ నుండి పరారయ్యాడన్నారు. ఈ విషయమై మైనరు బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి జామి పోలీసు స్టేషను ఎస్ఐ జి.వీరబాబు తే.07-06-2024దిన పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసారన్నారు. అనంతరం, కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించి, న్యాయ
స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.నిందితుడు వంతల శివ, (23 సం.లు) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి నిందితుడికి 3సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 4,000/-లు జరిమాన విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ.50,000/- మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసులు తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎం.ఖజానారావు వాదనలు వినిపించారన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్థవంతంగా పని చేసిన ఎస్ఐలు జి.వీరబాబు, వై.వీరజనార్ధన్, సి.ఎం.ఎస్. హెచ్.సి. సిహెచ్.రామకృష్ణ, కోర్టు కానిస్టేబులు ఎం.రమేష్ బాబు, స్పెషల్ పిపి ఎం.ఖజానా రావులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.


