భూభారతి, ఎస్.ఐ.ఆర్ అమలు తీరుపై సమీక్ష
జనంన్యూస్.నిజామాబాద్, 11.
భూభారతి పెండింగ్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన ఎడపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సందర్శించారు. తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక అమలుపై సమీక్ష జరిపారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంత మందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే, అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయా కేటగిరీల వారీగా మ్యాపింగ్ నిర్వహిస్తున్న విధానాన్ని పరిశీలించి, పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాద్రి ఉన్నారు.


