జనం న్యూస్ 24 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషనులో 2025సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కొత్తవలస మండలం, జోడుమెరక గ్రామంకు చెందిన జోడు అప్పన్న, (32 సం.లు)కు విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కే. నాగమణి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2,500/- లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ డిశంబరు 23న తీర్పు వెల్లడించారని విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం జిల్లా, కొత్తవలస మండలం, జోడుమెరక గ్రామానికి చెందిన నిందితుడు జోడు అప్పన్న అలియాస్ అభి, (32సం.లు) తే. 21-05-2025 దిన అదే గ్రామానికి వేసవి సెలవులకు చిన్నాన్న ఇంటికి వచ్చిన ఒక మైనరు బాలిక (6 సం.లు)కు చాక్లెట్ ఇచ్చి ఆ బాలికను పాడుబడిన ఇంట్లోకి తీసుకొని వెళ్ళి లైంగిక అఘాయిత్యానికి పాల్పడి నట్లుగా మైనరు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కొత్తవలస పోలీసు స్టేషను సిఐ సిహెచ్ షన్ముఖరావు తే.22.05.2025ది న పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసారన్నారు. అనంతరం అప్పటి విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.నిందితుడు జోడు అప్పన్న అలియాస్ అభి, (32 సం.లు)పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కే. నాగమణి గారు నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2,500/-లు జరిమాన విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసులు తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎం. ఖజానారావు వాదనలు వినిపించారన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్థవంతంగా పని చేసిన డిఎస్పీ ఎం. శ్రీనివాసరవు, విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఎం.గోవిందరావు, కొత్తవలస సి.ఐ. సి.హెచ్ షన్ముఖరావు, సి.ఎం.ఎస్. హెచ్.సి.సిహెచ్. రామకృష్ణ, కోర్టు కానిస్టేబులు సి. హెచ్ ఎర్రినాయుడు, స్పెషల్ పిపి ఎం. ఖజానారావులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.


