ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 26(జనం-న్యూస్):
ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ ఎంపీపీ, వైసీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు, నన్నెబోయిన రవికుమార్ యాదవ్, సర్పంచ్ నాగిరెడ్డి.
అర్ధవీడు మండలం రంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అర్ధవీడు మాజీ ఎంపీపీ, వైసీపీ జిల్లా పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షులు నన్నెబోయిన రవికుమార్ యాదవ్, సర్పంచ్ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. ఎందరో వీరుల పోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని, వారు అందచేసిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. భారతదేశం నేడు ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అన్నీ రంగాల్లో ముందంజలో నిలుస్తోందని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశం సాధిస్తున్న పురోగతి అమోఘమని కొనియాడారు. అదే విధంగా యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “మనం ఏ స్థాయిలో ఉన్నా సరే, మాతృభూమి పట్ల గౌరవాన్ని, బాధ్యతను మరువకూడదు. భారతదేశాన్ని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టడమే మనం ఆ మహనీయులకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.


