అనుమతులు ఉండవు… అక్రమంగా షెడ్లు నిర్మాణంపై – స్థానికుల ఆందోళన అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

జనం న్యూస్ ఫిబ్రవరి 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి: వాణిజ్య అవసరాల కోసం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా భారీ షెడ్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించి వాణిజ్య కార్యకలాపాలకు వేదికలు అవుతున్నాయని ఆరోపణలు కూకట్ పల్లి ప్రాంతంలో వెల్లు వెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, కెపిహెచ్బి కాలనీ, పరిసరాల్లో ఈ ధోరణి విస్తృతమైందని స్థానికులు వాపోతున్నారు. అధికారుల నుండి ఇటువంటి అనుమతులు తీసుకోకుండానే భారీ షెడ్లు నిర్మాణాలు చేపడుతున్నారు. షెడ్లు నిర్మాణం చేపట్టి హోటల్స్ తో పాటు చిన్నతరహా వాణిజ్య సంస్థలుగా మారుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం, రహదారులపై వాహనాల నిల్వ పెరగడం వల్ల కాలనీల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. హైదర్ నగర్లోని జల వాయు విహార్ గేట్ సమీపంలో ఒక వ్యక్తి అక్రమంగా భారీ షెడ్డును నిర్మిస్తున్నాడని స్థానికులు ఫిర్యాదు చేసిన అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. నియమ నిబంధనలు పక్కనపెట్టి యజమానులు స్థలాలను అద్దెకివ్వడంతో వాటిల్లో అక్రమంగా షెడ్లను నిర్మించి వాణిజ్య ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. నగర అభివృద్ధి నిపుణుల అభిప్రాయం ప్రకారం, నివాస ప్రాంతాల్లో నియంత్రణలేని వాణిజ్య విస్తరణ వల్ల భవిష్యత్తులో మౌలిక సదుపాయాలపై భారం పెరిగే ప్రమాదం ఉంది. పార్కింగ్, డ్రైనేజ్, అగ్నిమాపక భద్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా వినియోగ మార్పులు జరగడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా పట్టణ ప్రణాళిక నియమాలను కచ్చితంగా అమలు చేయాలని, ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నివాస ప్రాంతాల ప్రశాంతతను కాపాడటంలో సంబంధిత శాఖలు చొరవ చూపాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


