జనం న్యూస్ ఫిబ్రవరి 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి పాత శివాలయం వద్ద రోడ్డుపై అనాథ స్థితిలో వృద్ధుడు పడిన దుస్థితి మాత్రం స్థానికులను మాత్రమే కాదు, నన్ను కూడా కలిచివేసింది. కొద్ది రోజులుగా అక్కడే నివసిస్తూ, సరైన ఆహారం, వైద్య సహాయం లేక ఇబ్బందులు పడుతున్న ఆ వృద్ధుడిని చూసి పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయం వెంటనే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆలస్యం చేయకుండా స్పందించారు. మానవతా దృక్పథంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు, పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఎమ్మెల్యే సూచనల మేరకు నియోజకవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షులు, కూకట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బొట్టు విష్ణు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడిని సురక్షితంగా శివనంద రీహాబిలిటేషన్ హోమ్ కు తరలించారు. అక్కడ ఆయనకు తక్షణ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సతో పాటు ఆశ్రయం కల్పించారు.స్థానికులు మాట్లాడుతూ, “ప్రజల సమస్యలపై వెంటనే స్పందించే ప్రజాప్రతినిధి ఉండటం మా అదృష్టం. అవసరంలో ఉన్న వ్యక్తికి అండగా నిలవడం నిజమైన సేవ” అని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును అభినందించారు.ప్రజల మధ్య ఉండి సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కార దిశగా అడుగులు వేయడం ప్రజాసేవలో కీలకమని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. అనాథ స్థితిలో ఉన్న ఒక ప్రాణానికి అండగా నిలిచిన ఈ చర్య స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.



