బిచ్కుంద మార్చి 25 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) బిచ్కుందలో ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “ఇన్నోవేషన్ ఇన్ రీసెర్చ్ మెథడాలజీ” అనే అంశంపై ఒకరోజు కార్యశాల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కె. అశోక్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో పరిశోధనకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇలాంటి కార్యశాలలు, సెమినార్లు విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉత్తమ పరిశోధనలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పరిశోధకులు, పీజీ మరియు యూజీ విద్యార్థులు పరిశోధన పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.కార్యశాల కన్వీనర్ డాక్టర్ జి. వెంకటేశం మాట్లాడుతూ కరోనా అనంతరం విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం విస్తరించిన నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఇవి విద్యార్థులకు పరిశోధన అవకాశాలను విస్తరించడంలో సహకరిస్తాయని వివరించారు.ముఖ్య వక్తగా పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ అశోక్ తిప్రాసి మాట్లాడుతూ పరిశోధనలో సరైన ఫలితాలు సాధించాలంటే నాణ్యమైన మరియు ప్రామాణిక సాహిత్యాన్ని ఆధారంగా తీసుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.అలాగే SRNK డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఐ. గంగాధర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యశాలలు విద్యార్థులకు విశేష సమాచారాన్ని అందించడంతో పాటు పరిశోధన పద్ధతులపై ఆసక్తిని పెంపొందిస్తాయని, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పారు.మరో రిసోర్స్ పర్సన్ కె. గంగాధర్ మాట్లాడుతూ కృతిమ మేధ (AI) ప్రాముఖ్యత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు దీనిపై అవగాహన పెంపొందించుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశోధనలను మెరుగుపరచాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న పరిశోధక విద్యార్థులకు, పి జి, యూజి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా కార్యశాలలో పాల్గొన్న వక్తలను కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం శాలువా, మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పీజీ మరియు యూజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.




