

జనం న్యూస్ 28 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా జిల్లాలో ఉపాధి అవకాశాలను పెంపొందిస్తూ, రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేసి ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐ.డి.ఓ.సి.వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ సమావేశం నిర్వహించారు. మార్చి 2న రాష్ట్ర ముఖ్యమంత్రి వనపర్తి జిల్లాకు రానున్న నేపథ్యంలో ఉద్యోగ మేళా, రుణ మేళా స్టాల్స్ ఏర్పాట్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో విద్యా, గృహ రుణాల మంజూరు తక్కువగా ఉండటంతో, వీటిని గణనీయంగా పెంచేలా బ్యాంకర్లు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రుణ పంపిణీలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు రుణాలను త్వరగా మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. మార్చి 2న ముఖ్యమంత్రి వనపర్తి జిల్లాకు రానుండగా, వనపర్తిలో ఉద్యోగ మేళా,రుణ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మార్చి 1న ఉద్యోగ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేళాకు జిల్లా నుండి ఎక్కువ మంది యువకులు హాజరయ్యేలా విస్తృత ప్రచారం చేయాలని, గ్రామ, మండల స్థాయిలో సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.రుణ మేళా కోసం బ్యాంకర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని,రుణ మంజూరు లక్ష్యాలు,ఇప్పటి వరకు మంజూరైన ₹200 కోట్ల రుణాల వివరాలను సమగ్రంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు మంజూరైన రుణాలపై పూర్తి స్థాయి నివేదిక రూపొందించి,ఈ సాయంత్రం లోపు సమర్పించాలని సూచించారు. రుణ మేళా,ఉద్యోగ మేళా కోసం ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నామని, ముఖ్యమంత్రి వీటిని సందర్శించి లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను, ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారని తెలిపారు.అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పోటెన్షియల్ లింకిడ్ క్రెడిట్ ప్లాన్ బుక్ విడుదల చేశారు.2025-26 ఆర్థిక సంవత్సరానికి జిల్లా మొత్తం రుణ సామర్థ్యం ₹57,43,98.43 లక్షలుగా అంచనా వేయబడిందని తెలిపారు. వ్యవసాయం కోసం ₹2,99,856.66 లక్షలు,దీర్ఘకాలిక పెట్టుబడులు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు ₹1,94,657.34 లక్షలు రూపాయలు కేటాయించగా, MSME రంగానికి ₹6,06,000 లక్షల రూపాయల అంచనా వేశారని, ఇతర ప్రాధాన్యతా రంగాలకు ₹19,284.43 లక్షలుగా రుణ సామర్థ్యాన్ని నిర్ణయించారని తెలిపారు. ఈ సమావేశంలో డిసిసిబి చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగరావు, ఎల్ డి ఎం అయ్యపురెడ్డి,నాబార్డ్ డీడీఎం మనోహర్ రెడ్డి, జి.యం ఇండస్ట్రీస్ రామలింగేశ్వర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ బాబు, చేనేత సహాయ సంచాలకులు గోవిందయ్యా, మత్స్య శాఖ అధికారి షకీలా భాను, పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వివిధ శాఖల సంబంధిత అధికారులు, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.