

జనం న్యూస్ -జనవరి 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-
నాగార్జునసాగర్ లో జరుగుతున్న ఆదివాసి సాధికారత శిక్షణ తరగతుల కార్యక్రమం ముగింపు వేడుకలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం తూచా తప్పకుండా.. సంపూర్ణంగా అమలు బాధ్యత నేనే తీసుకుంటాను, వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ కి సంబంధించి తాను చీఫ్ విప్ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమావేశపరిచి అధిష్టానానికి ఒక నివేదిక ఇచ్చి తూచా తప్పకుండా అమలు చేయాలని కోరాం. ఆ తర్వాత తాను డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సమయంలోనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఆమోదం పొందిందని తెలిపారు. ఈ చట్టాన్ని మొదలుపెట్టిన వ్యక్తిగా, బిల్లును ఆమోదింప చేసిన వ్యక్తిగా నాకు సంపూర్ణ అవగాహన ఉంది.. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా పార్టీ నాకు అవకాశం ఇచ్చింది, అమలు చేసే బాధ్యత తనపై సంపూర్ణంగా ఉందని తెలిపారు. సబ్ ప్లాన్ చట్టం సర్వరోగ నివారిణిగా అభివర్ణించారు.
అన్ని శాఖల సెక్రటరీలను సమావేశపరచి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం నిధుల కేటాయింపు జరుగుతుందా? లేదా? అని నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించాను. ఇప్పటికే రోడ్లు ,భవనాలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నివేదిక సమర్పించారని, మిగిలిన వారితో నివేదికలు తెప్పించి త్వరలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద 10 శాతం నిధులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే… రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉండటంతోనే సబ్ ప్లాన్ చట్టం అమలు చేయగలుగుతున్నామని ప్రజల్లో గట్టిగా ప్రచారం చేయాలని ఆదివాసీ ప్రజాప్రతినిధులను డిప్యూటీ సీఎం కోరారు.
ఐటీడీఏలను పునర్జీవింప చేస్తాం, వాటికి కావాల్సిన బడ్జెట్ కేటాయించి నిరుద్యోగులకు శిక్షణ కల్పించి స్వయం ఉపాధిని కల్పిస్తాం అన్నారు.
ఈ దేశ సంపద, వనరులు ఇక్కడి ప్రజలకే థామశా ప్రకారం అందాలి తప్ప కార్పోరేట్ శక్తులకు కాదు అన్నారు.
భారత రాజ్యాంగాన్ని బలహీనపరచాలని, రాజ్యాంగం ద్వారా సామాన్యులు పొందిన హక్కులను కాలరాసేందుకు కుట్ర జరుగుతుంది అన్నారు.
రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనందరినీ రక్షిస్తుంది, రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ నడుము బిగించారు సంవిధాన్ సమ్మేళన్ పేరిట ఆయన దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని వారు వేగంగా అడుగులు వేస్తున్నారు అంతే వేగంగా పార్టీ శ్రేణులు రాజ్యాంగ రక్షణకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పీసా చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాన్ని 100% సంపూర్ణంగా అమలు చేస్తాం అన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను చేపట్టిన పాదయాత్రలో ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుందని ఇల్లు లేని నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు చెప్పాను. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో హక్కులు కాదు మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయాం అని రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు అని అన్నారు.
తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తున్నాం. పది సంవత్సరాలుగా ఇల్లు లేని పేదలకు 22,500 కోట్లు ఖర్చుపెట్టి మొదటి దశలో నాలుగున్నర లక్షల మందికి రాష్ట్రంలో ఇల్లు నిర్మించనున్నాము. ఐదు లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నాం ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఒక లక్ష రూపాయలు జత చేసి ఆరు లక్షల వ్యయంతో ఇల్లు నిర్మించనున్నాము.ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అందించబోతున్నాము.
సాగు యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా కింద జనవరి 26 నుంచి 12,000 జమ చేయబోతున్నాం. కాంగ్రెస్ వస్తే రైతు భరోసా ఉండదని బి ఆర్ ఎస్ నేతలు ప్రచారం చేశారు కానీ మేము 10 వేలకు మరో రెండు వేలు కలిపి 12000 రైతుల ఖాతాలో జమ చేయబోతున్నాం అన్నారు.
కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇవ్వబోతున్నాం
ఈ పథకాలన్నిటిని కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా ఊరురా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత చేపట్టాలన్నారు.
ఆదివాసీలు భూమిని తల్లిగా, నదులను రక్తం మాంసాలుగా భావిస్తారు, వాటి నుంచి వారిని దూరం చేస్తే ప్రాణం లేని శవాలతో సమానం. ఆదివాసీలపై ప్రేమ లేని వారు వాటి నుంచి వారిని దూరం చేసే ప్రయత్నం వేగంగా చేస్తున్నారని ఆరోపించారు.
దేశ స్వతంత్రం కోసం రాంజీ గోండు, కొమురం భీం, బిర్సా ముండా పెద్ద ఎత్తున పోరాటం చేశారని, దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు సైతం ఇచ్చేందుకు వెనుకాడని ధీరోదాతులు ఆదివాసీలు, గిరిజనులు అన్నారు. హక్కులను స్వేచ్ఛగా ప్రశ్నించే చట్టాలను తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అన్నారు. పిసా, అటవీ హక్కులు, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం, ఆర్ ఓ ఆర్, ఎస్సీ ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం చట్టాలు ఇ0దుకు నిదర్శనం అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలను అమలు చేసుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు అందరి పైన ఉందని తెలిపారు. అటవీ హక్కుల చట్టం ద్వారా వచ్చిన భూముల్లో విద్యుత్ సౌకర్యం పొందేందుకు లైన్లో వేసే క్రమంలో అటవీ శాఖ నుంచి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఆ భూముల్లో సోలార్ పవర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి, మోటార్ల ద్వారా ఆయా భూములు సాగులోకి తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు .సౌర శక్తి ఉత్పత్తికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వమే చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి, దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఇస్లావత్ రామచంద్రనాయక్, బెల్లయ్య నాయక్, రాంబాబు నాయక్, ఏఐసీసీ మెంబర్ కొప్పుల రాజు, డిసిసి నాయకులు శంకర్ నాయక్, మందుల సామెల్, కర్నాటి లింగారెడ్డి, తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి ,తిరుమల కొండ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు బాధ్యత సంపూర్ణంగా తీసుకుంటా –మల్లు భట్టి విక్రమార్క