

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 12 రిపోర్టర్ సలికినీడి నాగరాజు నాదెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం ఎంపీడీవో స్వరూప రాణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా మండల ప్రత్యేక అధికారి, జిల్లా మత్స్య శాఖ అధికారి సంజీవరావు పాల్గొన్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో పలు అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మండలంలోని పలు గ్రామాల ప్రజాప్రతినిధులు వారి వారి గ్రామాల్లో ఉన్న పలు సమస్యలను ఈ సందర్భంగా సభ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తామని సంబంధిత అధికారులు స్పందించారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి, జిల్లా మత్స్య శాఖ అధికారి సంజీవరావు మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కాలం వచ్చినందున గ్రామాల్లో మంచి నీటి సరఫరాపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. మంచి నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన వారికి వివరించారు. దీనితో పాటుగా అంటు వ్యాధులు ప్రభలకుండా పారిశుధ్య పనులు నిరంతరం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం మండలంలో మంచి నీటి ఎద్దడి లేదని, వేసవికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పలువురు బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ పి. సిద్ధలింగ మూర్తి, ఎంపీపీ తలతోటి రాణి, తహశీల్దార్ ఆలపాటి వెంకట రమణ, వ్యవసాయ అధికారి అందె హరిప్రసాద్, వైద్యురాలు జ్ఞానేశ్వరి, పశువైద్యులు, ఏపీవో రామారావు, ఎపిఎం రమేష్ బాబు, పీఆర్ ఏఈ కిలారు వెంకటేశ్వర రావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు, అంగన్వాడీ పర్యవేక్షకురాలు నిర్మల కృష్ణ మాల, అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది సైదారావు, కెనెడీ, తదితరులు పాల్గొన్నారు.