

జనం న్యూస్ 20 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక అదానీ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి వేలాదిమంది విద్యుత్తు మీటర్ రీడింగ్ తీసే కార్మికుల పొట్టలు కొడతారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపడ్డారు.గురువారం ఉదయం విజయనగరం దాసన్నపేట విద్యుత్తు భవన్ ముందు ఎ. పి విద్యుత్తు మీటర్ రీడర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) నిరసన ధర్నా చేపట్టి అనంతరం ఎస్.ఇ, టౌన్ డి.ఇ, రూరల్ డి.ఇ గార్లకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలోని ఎస్పిడిసిఎల్, సిపిడిసిఎల్, ఇపిడిసిఎల్ పరిధిలో సుమారు 4,500 వేల మంది విద్యుత్ మీటర్ రీడర్స్ గత 20 సంవత్సరాలుగా పని చేస్తున్నారన్నారు. 20 ఏళ్ళుగా భద్రత లేని కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఓ పక్క ఆందోళన చేస్తుంటే మరోపక్క నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లును వ్యతిరేకించి నేడు బిజెపి తో జత కట్టారు కాబట్టి కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లును ప్రోత్సహిస్తూండటం వలన రీడింగ్ కార్మికులును భయాందోళనకు గురి చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజూ ఇంటింటికి వెళ్లి కరెంట్ రీడింగ్ తీసి కన్స్యూమర్స్కు ఇవ్వటంతోపాటు సంస్థకు ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నారన్నారు. విద్యుత్ సంస్థనే నమ్ముకుని ఎప్పటికైన సంస్థలోనే ఉద్యోగ భద్రత దొరుకుతుందని ఆశతో పని చేస్తున్న మీటర్ రీడింగ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి రీడర్ల ఉపాధి తీసేసి రోడ్డు పాలు చేయాలని దుర్మార్గపు ఆలోచనతో చాప కింద నీరులా వ్యవహరిస్తుందనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క సర్వీసుకు కేవలం 3.60 పైసల పీసురేటుతో నెలకు 6 వేల నుండి 10 వేల రూపాయల లోపు మాత్రమే వేతనంతో పని చేస్తు వారి కుటుంబాలను పోషించుకుంటున్న చిరు వేతన జీవుల పై ఇలాంటి నిర్ణయాలు చేయడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతూ ఏనాటికైనా సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని యాజమాన్యం పైన, ప్రభుత్వం పైన వివిధ రూపాలలో ఒత్తిడి తెస్తూ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. అనేక సంవత్సరాలుగా మీటర్ రీడర్స్ను ఐక్యం చేస్తూ వేతనాల పెంపుకోసం, ఉద్యోగ భద్రత కోసం యూనియన్ కృషి చేస్తున్నదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టికి మీటర్ రీడర్ల సమస్యలు తీసుకుపోవటం, ఉద్యోగ భద్రత కోసం సంప్రదింపులు, వినతులు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించటం జరిగిందన్నారు. రాబోయో కాలంలో మీటర్ రీడర్ల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ పోరాటాల్లో రిడింగు కార్మికులు సంసిద్ధం అవ్వాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాసరావు, పసుమర్తి శ్రీకాంత్ (ఎస్. కోట సబ్ డివిజన్), విజయనగరం సబ్ డివిజన్ నుంచి గోక రమణ, ( గజపతినగరం సబ్ డివిజన్ ) ఆది మరియు రీడింగ్ కార్మికులు పాల్గొన్నారు.