Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 4 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

ప్ర‌ధాని మోదీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్య‌ద‌ర్శి తాళ్లూరి బాబురావు అన్నారు. సీపీఐ దేశ‌వ్యాప్త ప్ర‌చార ఆందోళ‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా శుక్ర‌వారం ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల్లో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా బాబురావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ ఆధ్వర్యంలో మార్చి 23 నుంచి ఏప్రిల్‌ 14 వరకు దేశవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింద‌ని వెల్ల‌డించారు. దేశంలో మోడీ అధికారంలో మైనార్టీలకు, భద్రత లేకుండా పోయిందని, వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు పేరుతో ముస్లిం మైనార్టీల హ‌క్కుల‌ను కాల‌రాశార‌ని పేర్కొన్నారు. ముస్లింల హక్కులు, స్వేచ్ఛను కాలరాయటానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతూ వక్ఫ్‌ బిల్లును తెర‌మీదకు తెచ్చింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న కార్పొరేటు అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ విస్తారంగా ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంద‌న్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద, కార్మిక వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలను ఐక్యపోరాటంతో తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను దుర్మార్గులుగా చూపుతూ స్వపక్షంలోని అవినీతిపరులను వెనకేసుకొస్తూ బీజేపీ ప్ర భుత్వం అనేక కుట్రలకు తెరలేపుతున్నదని విమర్శించారు. కార్య‌క్ర‌మంలో AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ సుభాని,ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు, కందిమల్ల వెంకటేశ్వర్లు ,మహిళా సమాఖ్య ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, సౌతుపల్లి నాగేశ్వరరావు, ముసబోయినా వెంకటేశ్వర్లు, AIYF నాయకులు మల్లికార్జున్,రాంబాబు,aisf నాయకులు యం.నాగేశ్వరావు,నాశర్,బొంత నాగేశ్వరావు తదితరులు.