

జనం న్యూస్ – ఏప్రిల్ 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
దర్తి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం కింద గిరిజన తండాలు, వెనుకబడిన గిరిజన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు గాను కార్యాచరణ ప్రణాళికతో పాటు, అంచనాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.దర్తి ఆబా యోజన పథకం కింద కల్పించే మౌలిక వసతుల విషయమై గురువారం ఆమె నల్గొండ జిల్లా, పెద్దవూర మండలం, నందికొండ మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దర్తి ఆభా యోజన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గత సంవత్సరం నవంబర్ 14 న ప్రారంభించడం జరిగిందని, ఈ పథకం అమలులో భాగంగా అత్యంత వెనుకబడిన గిరిజన గ్రామాలు ,తండాలలో గిరిజనులకు మౌలిక వసతుల కల్పనతో పాటు, వారి చలనాన్ని పెంచడం,జీవన ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మైదాన ప్రాంతంలో మాదిరిగానే వారికి సౌకర్యాలను కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం అని అన్నారు.
ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలోని అన్ని చెంచు పెంటలు, గూడెంలలో సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ప్రత్యేకించి నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో తిరుమలగిరి సాగర్, పెద్దవూర, త్రిపురారం మండలాలలో గుర్తించిన 18 తాండాలలో మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ గ్రామాలలో వన్ ధన్ విక్రయ కేంద్రాలను (వి డి వి కె) ఏర్పాటు చేయడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తించిన తండాలలో రహదారులు, విద్యుత్, తాగునీరు ,విద్య, వైద్య సదుపాయాలు, స్వయం ఉపాధి, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఇతర రంగాల ద్వారా జీవనోపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుందని వెల్లడించారు.ఈ మూడు మండలాలలో గుర్తించిన 18 గ్రామాలలో తండాలలో తాగునీటి ట్యాంకులు లేని చోట సంపుల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాలని, అదేవిధంగా ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చే విధంగా ప్రతిపాదనలను రూపొందించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు .అలాగే సోలార్ మోటార్ పంపుల ద్వారా తాగునీరు ఇచ్చే లా ప్రణాళిక,అంచనాలు రూపొందించాలన్నారు. సంప్రదాయ పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ను ఆదేశించారు. రెడ్ కో ద్వారా సోలార్ లైట్లు, సోలార్ పంప్స్, స్ట్రీట్ లైట్లు, వ్యక్తిగత పంపు సెట్లు, వ్యవసాయ మోటార్ పంపుల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని జిల్లా మేనేజర్ ను ఆదేశించారు . ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడి కేంద్రాలు లేని చోట అంగన్వాడి కేంద్రాల నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. మత్స్యశాఖ ద్వారా ఇన్సులేటెడ్ మత్స్య సేవా హనాలు, అలాగే ఐస్ బాక్సులు, చేపల పెంపకానికి పాండ్స్ నిర్మాణం , కమ్యూనిటీ పరంగా చేపల పెంపకం, చేపల ఉత్పత్తుల ద్వారా ఆదాయం ఆర్జించే విధంగా యునిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా సబ్ సెంటర్లు లేని చోట సబ్ సెంటర్ లను ప్రతిపాదించాలని, మందుల పంపిణీకి వాలంటీర్లను నియమించేందుకు ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో చెంచుల కోసం వసతి గృహం ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని పరీక్షలు, శిక్షణ సమయాలలో గిరిజనులకు ఉపయోగపడే విధంగా ఈ వసతిగృహం ఉపయోగపడే విధంగా ఉండాలని జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని ఆదేశించారు. వీటన్నిటికీ సంబంధించి వారం రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సమర్పించాలని, కలెక్టర్ ఆదేశించారు. వీటన్నింటిని వన్ ధన్ విక్రయ కేంద్రాల ద్వారా అమలు చేయడం జరుగుతుందన్నారు. అన్ని ఇంజనీరింగ్ శాఖల అధికారులు సైతం వారి శాఖలకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, గిరిజన సంక్షేమ శాఖ ఇంచార్జ్ అధికారి రాజ్ కుమార్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డిపిఓ వెంకయ్య, మత్స్యశాఖ ఏ డి చరిత, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పెదవుర తహసిల్దార్ శ్రీనివాస్ , ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గిరిజన తండాలలో మౌలిక వసతుల కల్పనకై అంచనాలను రూపొందించే నిమిత్తం సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, దర్తి ఆబా యోజన కింద సుమారు 95 కోట్ల రూపాయల వ్యయంతో నల్గొండ జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు అందిన తర్వాత రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు.